ఆగస్టు 15 వరకు ఎర్రకోట మూసివేత
సందర్శకులకు నో పర్మిషన్
భద్రతా కారణాల రీత్యానే మూశామంటున్న అధికారులు
-ఉగ్రవాదుల దాడులు జరగవచ్చునని సమాచారం
75 స్వతంత్ర దినోత్సవ వేడుకలు … మువ్వన్నెల జెండా ఎగర వేయనున్న ప్రధాని
న్యూఢిల్లి
భద్రతా కారణాలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాక ఎర్రకోటను ఆగస్టు 15 వరకు మూసివేశారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు దాడి చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భద్రతా కారణాలతో పాటు కరొనా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 15 వరకు ఎర్రకోటను మూసి వేయాలని కోరుతూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఢిల్లీ పోలీసులు ఈ నెల 12న లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తమకున్న అధికారాల మేరకు ఈనెల 21 నుంచి ఆగస్టు 15 వరకు జరిగే స్వాతంత్ర్య వజ్రోత్సవం ముగిసే వరకు ఎర్రకోటలోకి సందర్శకులను అనుమతించబోమని బుధవారం తెలిపింది.మరోవైపు జమ్ము కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కి సంబంధించిన 370 రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ఆగస్టు 5 నాటికి రెండేండ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేస్తామని ఇటీవలే ప్రకటించారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ఢిల్లీతో పాటు సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రి, ఘాజిపూర్ వద్ద భద్రతను పెంచారు. డ్రోన్ల దాడులను ఎదుర్కునేందుకు భారత వాయుసేన, ఎన్ఎస్ జి, డీఆర్డివో సహకారంతో 360 డిగ్రీల యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు.