హుజూరాబాద్ ఘోర ఓటమిపై టీపీసీసీ పోస్ట్ మార్టం !
-ఇవాళ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం
-ఇప్పటికే గాంధీభవన్ లో సీనియర్ నేతలు మధ్య వాడి వేడి చర్చ
-నిన్న పార్టీ నాయకత్వంపై నేతల ఆరోపణలు
-సమావేశానికి హాజరు వేయించుకొని వెంటనే వెళ్లిన జానారెడ్డి
-ప్రశ్నిస్తానన్న జగ్గారెడ్డి సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవంపై కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం పోస్ట్ మార్టం స్టార్ట్ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి 60 వేలకుపైగా ఓట్లు వచ్చినా.. తాజా ఉప ఎన్నికల్లో కేవలం 3 వేల ఓట్లే రావడం, డిపాజిట్ గల్లంతు కావడం చర్చనీయాంశమైంది. దీంతో కారణాలేంటన్న దానిపై ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ అగ్రనాయకత్వం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. దీనిలో వాడి వేడి చర్చ జరిగినట్లు సమాచారం . రేవంత్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై మరో సారి నేతలు గళం ఇప్పారు. సమిష్టి నిర్ణయాలు లేవని కొందరు నేతలు మండిపడ్డారు.
ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటు పార్టీ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డిలు చేసిన వ్యాఖ్యలూ పార్టీ నేతల్లో కలకలం రేపాయి.
టీపీసీసీ అగ్ర నాయకుల వల్లే బల్మూరి ఓడిపోయారని, ఆయన్ను బలిపశువును చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇటు కోమటిరెడ్డి మరో అడుగు ముందుకేసి.. కాంగ్రెస్ గెలవదని తెలిసే ఈటలకు మద్దతివ్వాల్సి వచ్చిందంటూ కామెంట్ చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ కొట్టిపారేశారు. తాము బీజేపీకి ఎలాంటి మద్దతూ ఇవ్వలేదన్నారు.
ఈ నేపథ్యంలోనే పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ నాయకులు కలిసి పనిచేయకపోవడం వల్లే ఓటమిపాలైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కజిన్ అయిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ కు పనిచేయడం, చివరికి పార్టీ ఫిరాయించడం వంటి వాటి వల్ల కూడా పార్టీపై ఓటర్లలో నమ్మకం పోయిందని అభిప్రాయాలూ ఉన్నాయి . వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని హుజూరాబాద్ ఓటమికి కారణాలను విశ్లేషించారు . భవిష్యత్ లో ఇలా జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ్టి సమావేశం చర్చించింది . సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి , ఉత్తమకుమార్ రెడ్డి , జీవన్ రెడ్డి , గీతారెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి వచ్చి మధ్యలోనే వెళ్లిపోయిన జానారెడ్డి..
వెళ్తూ వెళ్తూ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు, పార్టీ పరిస్థితిపై చర్చించడానికి ఈ రోజు హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఊహించినట్లుగానే ఈ సమావేశం చాలా వాడీవేడిగా కొనసాగుతోంది.
ఇక ఈ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. వెళ్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి సమావేశానికి తానిక రానని, తన అవసరం ఉన్నప్పుడే వస్తానంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను ఈ సమావేశానికి హాజరుకాకపోతే, తాను రాలేదని అంటారని, ఆ మాట పడకూడదనే వచ్చి వెళ్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని లక్ష్యం చేసుకుని పార్టీ కీలక నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, వారిద్దరూ ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. ఈ సమావేశానికి హాజరై, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తానని నిన్న జగ్గారెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఆయన రాలేదు.