Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి ఖాయం…..రేవంత్ రెడ్డి

గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి ఖాయం—-రేవంత్ రెడ్డి
-కేసీఆర్ పతనం ప్రారంభమైంది -ప్రతిష్ట దిగజారింది
-నిన్ను దిగిపొమ్మన్నదే నీ కొడుకు ,నీ మంత్రులు
-బీజేపీ వన్ టైం వండర్ పార్టీ
-మోడీ మానియా పనిచేయదు
-మోడీ నియోజకవర్గంలో టీచర్ల , పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ ఓటమి
2023 ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఓటమి ఖాయం అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.కల్వకుర్తి లో ఎన్టీఆర్ ఏవిధంగా ఓడిపోయారో ,గజ్వేల్ ప్రజలు కూడా కేసీఆర్ కు అదే గతి పట్టిస్తారని అన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను మరిచి పోయారని కేసీఆర్ విధానాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ నుంచి హైద్రాబాద్ వరకు రైతు భరోసా యాత్రలో భాగంగా విలేకర్లతో మాట్లాడుతూ టీఆర్ యస్ , బీజేపీ విధానాలపై మండిపడ్డారు. దారిపొడవునా రైతులు కేసీఆర్ విధానాలపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారనేది అర్థం అయిందని అన్నారు. బీజేపీ , టీఆర్ యస్ లు వేరువేరు కాదని ఢిల్లీ దోస్తీ గల్లి లో కుస్తీలగా వారి వ్యవహారం ఉందని విమర్శించారు. రైతు చట్టాలపై ముందు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి వంగి వంగి సలాం లు చేసి రైతు చట్టాల ఊసేలేకుండా చేశారని అన్నారు. 70 రోజులుగా ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తుంటే బీజేపీ సర్కారు వారిని గురించి పట్టించుకోలేదని అన్నారు. ఇదేనా రైతులపట్ల బీజేపీ ,టీఆర్ యస్ వైఖరి అంటూ ప్రశ్నించారు.
నేనే పదేళ్లు ముఖ్యమంత్రినని కేసీఆర్ అంటున్నారు. 2023 ఎన్నికలలో కాంగ్రెస్ సునామి ముందు టీఆర్ యస్ , బీజేపీ కొట్టుకొని పోవటం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపో ,దిగిపో అంటున్నది ఎవరు అయ్యా కేసీఆర్……. నీకొడుకు, నీమంత్రులు కదా ? అని నిలదీశారు. నీపని అయిపోయిందని ఎమ్మెల్యే లు అనుకుంటున్నారు. అందుకే నీ కొడుకు కావాలని అంటున్నారు. ఎవరో దిగిపొమ్మన్నట్లు మాట్లాడుతున్నావు . నీ డ్రామాలు ప్రజలకు అర్థం అయ్యాయి . నీమోసాలు ఇక ఎంతోకాలం చెల్లవు. అందరిని మోసం చేశావు . ఉద్యోగులను , నిరుద్యోగులను , కార్మికులను , కర్షకులు , దళితులూ , మహిళలు , ఇలా చెప్పుకుంటూ పొతే అందరు ఉన్నారు. నీ ఆటలు ఇక సాగవని కేసీఆర్ మోసాలపై ధ్వజమెత్తారు.
బీజేపీ ను గురించి ఆయన మాట్లాడుతూ అది వన్ టైం వండర్ పార్టీ అన్నారు. మోడీ ,మోడీ అంటే మోడీ ఎన్నికైన వారణాసిలో పట్టభద్రుల , టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. మోడీ ఉండగానే అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయని వాటిలో ఓడిపోయిన విషయాన్నీ మరిచి పోవద్దన్నారు. మోడీ , మోడీ అంటున్నారు. మోడీ మానియా ఎల్లప్పుడూ పనిచేయదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో తిరిగి అధికారంలోకి వచ్చిన విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. హైద్రాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసిన బీజేపీ ఎన్నికల అయినా తరువాత , కేంద్ర బడ్జెట్ 20 లక్షల కోట్లు కదా అందులో నుంచి 20 కోట్లు తెచ్చి నగర ప్రజలకు ఎందుకు పంచటంలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడనుంచి ఉన్నారు కదా ఆర్థిక మంత్రిని అడిగి ఎందుకు నిధులు తేవటంలేదని ప్రజలు అడిగే రోజే ఏంతో దూరంలో లేదని అన్నారు.
తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని నేను భట్టి , జగ్గారెడ్డి , ఎవరు యాత్రలు చేసిన కాంగ్రెస్ నాయకత్వాన్ని సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరచటమేనని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి కూడా లోకసభలో పోరాడుతున్నారని అన్నారు. మాలో మాకు ఎలాంటి తగాదాలు లేవని స్పష్టం చేశారు.

Related posts

మీడియాతో చంద్రబాబు చిట్ చాట్- కీలక వ్యాఖ్యలు…

Drukpadam

బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డ రాజేశ్వర్‌రెడ్డి..

Drukpadam

17న గజ్వేల్‌లో కాంగ్రెస్ దండోరా సభ…

Drukpadam

Leave a Comment