Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్ట్ ఉద్యమ పితామహుడు అమర్నాథ్ ఇకలేరు

జర్నలిస్ట్ ఉద్యమ పితామహుడు అమర్నాథ్ ఇకలేరు
-కరోనా మహమ్మారితో చికిత్స పొందుతూ మృతి
-సంఘ నిర్మాణంలో ఆయన సేవలు అమోఘం
– పాత్రికేయుడిగా ఐదు దశాబ్దాల ప్రస్థానం
జర్నలిస్ట్ ఉద్యమ పితామహుడు ,ఇండియన్ జర్నలిస్ట్ ఉద్యమ నిర్మాణంలో అగ్రగణ్యుడు , తెలుగు రాష్ట్రాల ఉద్యమంలో ఒక పిల్లర్, పెద్దాయనగా పిలుచుకునే అమర్నాథ్ సార్ ఇక లేరు. ఆయన్ను కరోనా మహమ్మారి కాటేసింది . గత కొన్ని రోజులుగా మహమ్మారితో నిమ్స్ లో చికిత్స పొందుతున్న అయన మంగళవారం మరిణించారనే వార్త జర్నలిస్ట్ లోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేంది. ఆయనొక ఎన్ సైక్లోపీడియా .రాజకీయ విశ్లేషణలలోను దిట్ట . సమాజాన్ని అన్ని కోణాల్లో స్పృశించిన ఒక మహామేధావి . ఆయన మరణం జర్నలిస్ట్ ఉద్యమానికి , సమాజానికి తీరని లోటు .
జర్నలిస్ట్ గా అమర్నాథ్  ప్రస్థానం
-ఆంగ్లం లో వెలువడిన సోవియట్ యూనియన్ పత్రిక సోవియట్ భూమి పేరు తో తెలుగులో ప్రచురించే వారు. సోవియట్ భూమి లో సబ్ ఎడిటర్ గా అమర్నాథ్ జర్నలిస్టు జీవితం ప్రారంభం అయింది. సోవియట్ భూమి పత్రిక కు తాపి ధర్మారావు కుమారుడు తాపి రాంమోహన్ రావు ఎడిటర్ గా ఉండేవారు. ఆయన శిష్యుడిగా అమరనాథ్ మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత విశాఖపట్నం లో విశాలాంధ్ర లో కొంతకాలం పాటు పనిచేసి 1982లో గజ్జల మల్లారెడ్డి గారు ఆంధ్రభూమి ఎడిటర్ గా ఉన్న సమయం లో అమర్నాథ్ గారు సబ్ ఎడిటర్ గా చేరారు. సిపిఐ భావజాలం కలిగిన చాలా మంది జర్నలిస్టులు మల్లారెడ్డి హయాం లో ఆంధ్రభూమి లో చేరారు. వీరందరినీ మగ్దుం భవన్ బ్యాచ్ గా పరిగణించేవారు. ఆంధ్రభూమిలో న్యూస్ ఎడిటర్ స్థాయి కి ఎదిగారు. న్యూస్ ఎడిటర్ గా విజయవాడ, రాజమండ్రీ, హైదరాబాద్ లో పనిచేసి 2008 లో ఉద్యోగ విరమణ చేసారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) ప్రధాన కార్యదర్శి గా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శిగా, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. అనేక క్లిష్ట సమస్యలకు సైతం ఆయన ఇట్టే పరిస్కారం చెప్పేవారు . ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) ప్రచురించే స్క్రైబ్స్ న్యూస్ మాస పత్రిక ఎడిటర్ గా ప్రస్తుతం పెంచేస్తున్నారు. ఈ పత్రిక ఏప్రిల్ 2021 సంచిక కు కూడా ఈ నెల మొదటి వారంలో వెలువడింది. అందులో అమరనాథ్ గారు ఎడిటోరియల్ రాసారు. దురదృష్ట వశాత్తూ అదే చివరి ఎడిటోరియల్ అవుతుందని అనుకోలేదు.

ఈమధ్య ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశాలకోసం ఢిల్లీ వెళ్లివచ్చిన అమర్నాథ్ కరోనా బారినపడ్డారు!

గత కొద్దిరోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు!

ఆయన భార్య శ్రీమతి కృష్ణవేణి కూడా కరోనా బారినపడి చికిత్స పొంది కోలుకున్నారు!

వారి ఏకైక కుమారుడు శ్రీపద్ డెన్మార్క్ లో ఉంటున్నారు!

తల్లితండ్రుల అనారోగ్యం విషయం తెలిసి ఆయనమొన్ననే హైదరాబాద్ కు వచ్చారు!

జర్నలిస్ట్ యూనియన్ నేతలు కే. శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, నగునూరి శేఖర్, కె.విరహత్ అలీ తదితరులు అమర్నాథ్ ఆరోగ్య విషయమై తెలంగాణాప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేశారు!

ప్రభుత్వపెద్దలు, అధికారులు స్పందించారు!

అయితే ఆయనకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువఉండటంతో కోలుకోలేక పోయారు!

పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో కోసూరి సీతారామరాజు, సుభద్రమ్మ దంపతులకు 1952 సెప్టెంబర్ 15 న అమర్నాథ్ జన్మించారు!

వారిది మధ్యతరగతి రైతు కుటుంబం!

ఎనిమిదిమంది అన్నదమ్ములు, ఇద్దరుఅక్కాచెల్లెళ్లు ఉన్న పెద్ద కుటుంబంవారిది!

అమర్నాథ్ ప్రాథమిక విద్యాభ్యాసం మాముడూరులోనూ, ఎస్.ఎస్.ఎల్.సి. పొలమూరు హైస్కూల్ లోనూ జరిగింది!

భీమవరంలో పియుసి చదివారు!

తొలినుంచి విద్యలో బాగా రాణించిన అమర్నాథ్ చిన్నతనంలోనే ఇంగ్లీష్ భాషలో మంచిపట్టు సంపాదించారు!

ఆయన సమీపబంధువు ఎస్.ఆర్.దాట్ల కమ్యూనిస్టుపార్టీ ఎమ్మెల్యే!

తనఅన్నలు ఇద్దరుఆర్టీసీలో, మరొకరు రైల్వేలో ఉద్యోగాలు చేస్తూ ఏ.ఐ.టి.యు.సి. అనుబంధ కార్మిక సంఘాలలో క్రియాశీల నేతలుగా పని చేశారు!

దాంతో అమర్నాథ్ బాల్యంలోనే వామపక్షభావజాలం తో ప్రభావితులయ్యారు!

చిన్నతనం నుండి

బ్లిట్జ్ పత్రికను క్రమంతప్పకుండా చదివే అలవాటుఉన్న అమర్నాథ్ ఆ పత్రికలో “వక్స్ పాపులీ” కాలమ్ కు ఆరోజుల్లోనే రాస్తుండేవారు!

ఇంగ్లీష్ లో వచ్చినమార్కుల ఆధారంగాఆయన 1972 ప్రాంతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఎంపికయ్యారు!

పదేళ్లపాటు న్యూఢిల్లీలో యు.పి.ఎస్.సి.కేంద్రకార్యాలయం లో ఉద్యోగంచేశారు!

అప్పట్లోనే ఆయనకు భారత కమ్యూనిస్టుపార్టీ జాతీయ అగ్ర నేతలతో మంచి పరిచయాలు ఏర్ప డ్డాయి!

సి.పి.ఐ. కేంద్రకార్యాలయం

అజయ్ భవన్ తోనూ,

ఏ.ఐ.టి.యు.సి. కేంద్రంతోనూ సంబంధాలు ఉండటంతో ఆయనకు కార్మికోద్యమంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది!

అయితే ఆరోగ్యకారణాలతో ఆయన ఉద్యోగాన్నివిడిచి ఆంధ్ర ప్రదేశ్ కు తిరిగి రావాల్సివచ్చింది!

1984 లో హైదరాబాద్ లో ఆంధ్ర భూమి లో సబ్ ఎడిటర్ గా చేరారు!

ఆతర్వాత విశాఖపట్టణం, రాజమండ్రి, విజయవాడ కేంద్రాల్లో చీఫ్ సబ్ ఎడిటర్ గా, న్యూస్ ఎడిటర్ గా పనిచేశారు!

హైదరాబాద్ లోనే 2010 ప్రాంతంలో న్యూస్ ఎడిటర్ గా పదవీవిరమణ చేశారు!

ఆ తర్వాత ఎన్.ఎస్.ఎస్. వార్తా సంస్థకు కొంతకాలం పనిచేశారు!

కొన్నాళ్ళు ప్రజాతంత్ర వారపత్రికకు కూడా వ్యాసాలురాశారు!

ఏ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్రఅధ్యక్షునిగా సేవలు అందించారు!

ఐ.జే.యు.జాతీయ కార్యవర్గ సభ్యునిగా, జాతీయకార్యదర్శిగా పని చేశారు!

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ పాలక మండలి సభ్యునిగా రెండుసార్లు నియమితులయ్యారు!

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రెండుసార్లు సభ్యునిగా ఎన్నికయ్యారు!

“పాత్రికేయులపై దాడులు – వారి భద్రత” కు సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటుచేసిన సబ్ కమిటీకి చైర్మన్ గా దేశంఅంతా పర్యటించి చక్కని నివేదికను అందచేశారు!

పాత్రికేయుల పై దాడులుజరిగినా, పత్రికాస్వేచ్ఛకు భంగంవాటిల్లినా తక్షణం రంగంలోకి దిగడం ఆయనకు అలవాటు!

ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదులుచేసి వాటిపై చర్యలుతీసుకోవాలని పెద్ద పోరాటం సాగించేవారు!

గత పదిహేనేళ్లుగా దాదాపు అన్ని టీవీ న్యూస్ చానెళ్లలో విశ్లేషకునిగా ఆయన విశేషప్రాచుర్యం పొందారు!

ప్రస్తుతం ఐ.జే.యు.ప్రచురిస్తున్న “స్క్రైబ్స్ న్యూస్” ఆంగ్ల మాసపత్రిక సంపాదకునిగా పనిచేస్తున్నారు!

ఆయన సతీమణి శ్రీమతి కృష్ణవేణి ది కూడా పశ్చిమగోదావరిజిల్లా పెన్నాడఅగ్రహారం!

వారికి శ్రీపద్ ఒక్కడే కొడుకు.

శ్రీపద్ తనకుటుంబంతో ఉద్యోగ రీత్యా డెన్మార్క్ లో స్థిరపడ్డారు!

అమర్నాథ్ ప్రత్యేకత ఆయనకు గల అపార జ్ఞాపక శక్తి!

రాజ్యాంగం,కోర్టులు,చట్టసభలు, రాజకీయఘటనలు, సినిమాలు, ట్రేడ్ యూనియన్ ఉద్యమం వంటి అంశాలలో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం అనిచెప్పాలి!

వాటిల్లో ఏదిఅడిగినా వెంటనే తడుముకోకుండా చెప్పగలిగే వ్యక్తి అమర్నాథ్ మాత్రమే!

గత పాతికేళ్ళుగా

ఏ.పి.యు.డబ్ల్యు.జే., ఐ.జే.యు., సంబంధించి నివేదికలు, పత్రాలు, తీర్మానాలు, వేజ్ బోర్డుకు వినతి పత్రాలు తయారుచేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు!

తోటినాయకులతో, కార్యకర్తలతో చక్కటిసంబంధాలు కలిగి యూనియన్ లో ఒకపెద్దాయనగా గౌరవంపొందారు!


కేసీఆర్ ,జగన్ ల సంతాపం
—————————————
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లు సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు
——————————————————
శ్రీనివాస్ రెడ్డి ,అమర్ ల సంతాపం

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి మాజీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ లు షాక్ కు గురైయ్యారు . సహచరుడి మృతి తమను దుఃఖం లో ముంచిందని అన్నారు. తమకు మాటలు కూడా రావడంలేదని వారు పేర్కొన్నారు. ప్రతి విషయంలో కలిసి తిరిగి పనిచేసిన అమర్నాథ్ ను మహమ్మారి కరోనా వెంటాడి అకస్మాత్తుగా మానుండి దూరం చేస్తుందని అనుకోలేదని ఆయనకు జోహార్లు అర్పించారు. కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.
———————————————————————————-
ప్రెస్ అకాడమీ ,మీడియా అకాడమీ చైర్మన్ల సంతాపం
———————————————————————————-
సీనియర్ పాత్రికేయుడు కె అమర్నాథ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ రాజేంద్రనాథ్ రెడ్డి , తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలు తీవ్ర సంతాపం ప్రకటించారు.
———————————————————————————————–
ఐ జె యూ , టి యూ డబ్ల్యూ జె , ఏపీ యూ డబ్ల్యూ జె సంతాపం
———————————————————————————————–
అమర్నాథ్ ఆకస్మిక మృతిపట్ల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ , అధ్యక్ష క్రార్యదర్శులు కె శ్రీనివాస్ రెడ్డి , సెక్రటరీ జనరల్ బల్విందర్ జమ్మూ , ఐ జె యి కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి , టి యూ డబ్ల్యూ జె అధ్యక్ష ,కార్యదర్శలు , నగునూరి శేఖర్, విరహత్ అలీ లు , ఏపీయూ డబ్ల్యూ జె అధ్యక్ష కార్యదర్శలు సుబ్బారావు , చందు జనార్దన్ , ఐ జె యూ కార్యవర్గ సభ్యులు దాసరి కృష్ణా రెడ్డి కె సత్యనారాయణ , ఆలపాటి సురేష్, డి .సోమసుందర్ , ప్రెస్ కౌన్సిల్ సభ్యులు మజీద్ ఐ జె యూ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు కె రాంనారాయణ , నల్లి ధర్మారావు లు సంతాపం తెలిపారు .

రేపు జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు
———————————————————————————
అమర్నాథ్ అంత్యక్రియలు బుధవారం హైద్రాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోగల మహాప్రస్థానంలో జరుగుతాయని టి యూ డబ్ల్యూ జె ప్రధాన కార్యదర్శి విరహత్ తెలిపారు.

Related posts

టీటీడీ వర్సెస్ కిష్కింద ట్రస్ట్.. హనుమంతుడి జన్మస్థలంపై చర్చ రేపే!

Drukpadam

Woman Shares Transformation A Year After Taking Up Running

Drukpadam

రెండు డోసుల వ్యాక్సిన్ తర్వాత కూడా ఇంట్లోనే ఉండమంటే ప్రయోజనం ఏమిటి?: బాంబే హైకోర్టు సూటి ప్రశ్న ….

Drukpadam

Leave a Comment