Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు ఓకే …. బట్ కండిషన్ నియోజకవర్గ ప్రజలతో చేర్చిచాకే-మాజీమంత్రి ఈటల రాజేందర్

ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు ఓకే …. బట్ కండిషన్ నియోజకవర్గ ప్రజలతో చేర్చిచాకే
అరెస్టుల‌కు, కేసుల‌కు భ‌య‌ప‌డ‌ను..
నా ఇంటి చుట్టూ వంద‌ల మంది పోలీసుల‌ను పెట్టారు
క‌లెక్ట‌ర్ నివేదిక మాకు అంద‌లేదు
మా వివ‌ర‌ణ కూడా అధికారులు అడ‌గ‌లేదు
వ్య‌క్తులు, పార్టీలు ఉంటాయి పోతాయి కానీ వ్య‌వ‌స్థ‌లు మాత్రం శాశ్వ‌తం
ప్ర‌భుత్వం నుంచి నేను ఐదు పైస‌ల సాయం తీసుకోలేదు
ఐదు కుంట‌ల భూమిని కూడా పొంద‌లేదు
మీడియా సమావేశంలో మాజీమంత్రి ఈటల రాజేందర్

తెలంగాణ నేత ఈట‌ల రాజేంద‌ర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం అన్నారు.అయితే నియోజకవర్గ ప్రజలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని అన్నారు. రేపటినుంచి జరిగేది అదేకదా ? రాజీనామా చేయాలని కేసీఆర్ చెప్పిస్తుంటాడని కూడా అన్నారు. మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసిన తరువాత ఆయన మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు. ఎక్కడ పరుషపదజాలం ఉపయోగించకుండా ,తాను చెప్పదల్చుకున్న విషయాలను కామ్ గా కూల్ గా చెప్పారు. ఆయ‌న భూములు కాజేశారంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై సుదీర్ఘ వివిరణ ఇచ్చారు. తాను అరెస్టుల‌కు, కేసుల‌కు భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాదని, గతంలో అనేక విషయాలలో కేసీఆర్ ఎక్కడికి చెప్పితే అక్కడికి వెళ్లిన విషయాన్నీ గుర్తు చేశారు. నయుమ్ గ్యాంగు నుంచి చంపుతామని బెదిరింపులు వచ్చినప్పుడు కూడా భయపడలేదని అన్నారు. త‌న‌ ఇంటి చుట్టూ వంద‌ల మంది పోలీసుల‌ను పెట్టారని చెప్పారు. ఎంత పెద్ద కేసుల‌యినా పెట్టుకోండ‌ని, తాను న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తాన‌ని చెప్పారు.

భూములను కాజేశానంటూ వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రిపిన క‌లెక్ట‌ర్ నివేదిక త‌మ‌కు అంద‌లేదని తెలిపారు. త‌మ‌ వివ‌ర‌ణ కూడా అధికారులు అడ‌గ‌లేదని అన్నారు. వ్య‌క్తులు, పార్టీలు ఉంటాయి పోతాయి కానీ వ్య‌వ‌స్థ‌లు మాత్రం శాశ్వ‌తమ‌ని అన్నారు .

ప్ర‌భుత్వం నుంచి తాను ఐదు పైస‌ల సాయం కూడా తీసుకోలేదని, అలాగే ఐదు కుంట‌ల భూమిని కూడా పొంద‌లేదని చెప్పారు. అసైన్డ్ భూముల్లో ప‌లు కంపెనీలు రోడ్లే వేయ‌లేదా? అని ప్ర‌శ్నించారు. తాను 66 ఎక‌రాల భూమిని క‌బ్జా చేసిన‌ట్లు అధికారులు నివేదిక ఇచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌తో లేదా సిట్టింగ్ జడ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. అంతేగానీ, ప్ర‌భుత్వం ఏది చెబితే అది చేసే అధికారుల‌తో విచార‌ణ జ‌రిపించ‌కూడ‌ద‌ని అన్నారు . అధికారులు ఏమి చెపుతారో తెలియదా ? అని ప్రశ్నించారు.

19 ఏళ్లపాటు సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేశారని, ఫ్లోర్‌ లీడర్‌గా కూడా తనకు అవకాశం వ‌చ్చింద‌ని చెప్పారు. త‌న‌కు మంత్రిగా కూడా సీఎం కేసీఆర్‌ అవకాశం ఇచ్చారని చెప్పారు. తాను పార్టీకి, ప్రభుత్వానికి, కేసీఆర్‌కు మచ్చతెచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్నారు.

తెలంగాణ ఉద్యమం జ‌రుగుతున్న స‌మ‌యంలో త‌న‌కు అసెంబ్లీలో పోరాడే అవకాశం కల్పించారని ఆయ‌న చెప్పారు. అప్ప‌ట్లో కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా అధర్మం వైపు వెళ్లలేదని చెప్పారు. ఆయ‌న‌ తెలంగాణ ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారని, డబ్బులను నమ్ముకోలేదని పేర్కొన్నారు . అటువంటి కేసీఆర్ ఇప్పుడు త‌న‌లాంటి సాధారణ వ్యక్తిపై తన శక్తినంతా ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఈటల ఒక్కడుగా ఉండవచ్చు , ఉద్యమం సందర్భంగా కేసీఆర్ ఒక్కడే కాని తరువాత రాష్ట్రం అంత వెంట నడిచిందన్నారు. పదువులు శాశ్వతం కాదని వస్తుంటాయి పోతుంటాయి.వ్యక్తులు శాశ్వతం అని గుర్తుచుకోవాలని అన్నారు. పదవుల కన్నా ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. పదవుల కోసం పెదవులు మూసే రకం కాదు ఈటల రాజేందర్ అన్నారు. జైలు కు పోవడానికైనా సిద్ధమేనని అన్నారు. తాను కేసీఆర్ తో మాట్లాడలేదని అందుకు ప్రయత్నంకూడా చేయలేదని అన్నారు.అయితే కేటీఆర్ తో మాట్లాడే ప్రయత్నం రెండు మూడు సార్లు చేశానని ఆయన పి ఏ తరువాత మాట్లాడిస్తానని అన్నారని తెలిపారు. ఉద్యమంలో మీకంటే జూనియర్ కదా ఆయనతో మాట్లాడటం ఏమిటని ఒక విలేకరి ప్రశ్నించగా ఆయన పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ , అన్ని ఆయనే చూస్తుంటాడు అందుకే ఆయనతో నే మాట్లాడదామనుకున్నానని అన్నారు.

త‌న‌పై అన్ని శాఖలను ఉపయోగిస్తున్నారని, అలాగే, నర్సాపూర్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పిలిపించుకొని మాట్లాడార‌ని తెలిపారు. చర్చల తర్వాత అసత్య ప్రచారానికి పాల్ప‌డ‌డం కేసీఆర్ హోదాకు తగదని ఈట‌ల విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము అప్ప‌ట్లో కేసీఆర్‌తో అడుగు వేశాక పూర్తిగా ప్రజల్లో ఉన్నామ‌ని అన్నారు.

అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసి ఉంటే శిక్షకు అర్హుడినని ఈట‌ల అన్నారు . త‌న‌కు సంబంధం లేని భూమలను చూపించి అవి త‌మవ‌ని చెబుతున్నారని అన్నారు . అధికారులు ప్ర‌భుత్వం చెప్పింది చేయవచ్చని, భూములు కొలుస్తామని ఒక్క నోటీసు కూడా ఇవ్వ‌లేద‌ని అన్నారు. భూములు కొలిచేముందు 15 రోజుల నోటీసు ఇస్తారని ఆదర్మం కూడా పాటించలేదని అన్నారు. తాము లేకుండా వందల మంది పోలీసులను పెట్టి సర్వే కూడా చేయించ‌డం స‌రైందా? అని ప్ర‌శ్నించారు.

భూ కబ్జా ఆరోపణలపై కొందరితో త‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడించారని, ఓ సర్పంచ్ ముందుగా ఒక‌లా మాట్లాడి, ఆ త‌ర్వాత మ‌రోలా మాట మార్చారని చెప్పారు. దేవరయాంజిల్‌ భూముల విషయంలో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని అప్ప‌ట్లో వైఎస్‌ఆర్‌కు కూడా సవాలు విసిరాన‌ని చెప్పారు.

త‌న‌ కోసం దేవరయాంజిల్‌ ప్రజలను ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని చెప్పారు. అవి దేవాదాయ భూములు అని నిరూపించే ప‌త్రాలు చూపాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కలెక్టర్ ఇచ్చిన‌ నివేదిక పచ్చి అబద్ధ‌మ‌ని చెప్పారు. త‌న‌ మొత్తం ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై..

తాను ప‌దవుల కోసం పాకులాడ‌బోన‌ని ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబ‌ట్టి ఆ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఆ పార్టీ అడ‌గ‌వ‌చ్చ‌ని తెలిపారు. త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు. తాను కొత్త పార్టీ పెడ‌తాన‌ని, పార్టీ మార‌తాన‌ని ఎన్న‌డూ చెప్ప‌లేద‌ని అన్నారు.తనపై లేనిపోనివి ఉహించుకొని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఇది న్యాయమేనా కేసీఆర్ అన్నారు. ఆయనకు నాకు గ్యాప్ ఎందుకొచ్చిందో ఆయనకు తెలుసునని అన్నారు. న్యాయం ,దర్మం గెలవడం ఆలశ్యం కావచ్చుగాక కాని తప్పకుండ గెలుస్తుందని అన్నారు.
మంత్రులు ,ఎమ్మెల్యేలు ఎవరు సంతృప్తిగా లేరు
కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు గాని ,ఎమ్మెల్యేలు గాని ఎవరు సంతృప్తిగలేరని ఆరోపించారు.ఎవరు చెప్పకపోవచ్చు కాని ఇది యదార్థం అన్నారు.

Related posts

విజయ్ రూపాని రాజీనామా చేశారా ? చేయించారా??

Drukpadam

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఇక యుద్ధమే !

Drukpadam

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై మండిప‌డ్డ రేవంత్ రెడ్డి!

Drukpadam

Leave a Comment