కరోనా లో సేవలు అందిస్తున్న వారితో చంద్రబాబు వర్చువల్ సమావేశం
–పాల్గొన్న సోనూసూద్ తో పాటు అనేక మంది ప్రముఖులు
-వారందరికీ సెల్యూట్ చేస్తున్నానన్న చంద్రబాబు
-ఎన్నో విపత్తులు చూశాను కరోనా వంటి సంక్షోభం చూడడం ఇదే ప్రథమం
– సేవ చేయడం బాధ్యతగా భావించాలి సోనూసూద్ సేవలు ప్రశంసనీయం
కరోనా విజృంభణ నేపథ్యంలో పలు రంగాల నిపుణులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్చువల్ పద్ధతిలో సమావేశంలో మాట్లాడారు. ఇందులో సినీనటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ ట్రస్టు సేవలు అందిస్తోందని చెప్పారు.
కరోనా వేళ సోనూసూద్ అనేక సేవలు చేశారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. అటువంటి వారు సమాజానికి అవసరమని చెప్పారు. ఎన్నో విపత్తులు చూశాను కరోనా వంటి సంక్షోభం చూడడం ఇదే ప్రథమమని ఆయన అన్నారు. సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సేవ చేయడం బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని తెలిపారు.
కరోనాపై పోరాటంలో కుటుంబ సభ్యులు కూడా రోగుల వద్దకు వెళ్లట్లేదని, ఇటువంటి సమయంలో ఫ్రంట్లైన్ వారియర్లు విలువైన సేవలు అందిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. అధికారంలో వున్నా, లేకున్నా ప్రజాసేవలో ఉండడమే టీడీపీ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు సలహా ఇచ్చారు.
సాయం చేయాలని నాకు అర్ధరాత్రి కూడా కాల్స్ వస్తున్నాయి: సోనూసూద్
కరోనా వేళ తనకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సాయం కోసం ఫోన్ కాల్స్ వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సినీనటుడు సోనూసూద్ తెలిపారు .వర్చువల్ సమావేశంలో పాల్గొన్న సోనూసూద్ మాట్లాడుతూ… తనకు అర్థరాత్రి సమయంలో కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. తనకు వీలైనంత సాయం చేస్తున్నానని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో సేవ చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు.
తన భార్య ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తే కావడం సంతోషమని సోనూసూద్ వ్యాఖ్యానించారు. తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో ఆత్మీయ అనుబంధం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండో ఇల్లు వంటివని వ్యాఖ్యానించారు.
తాను హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడి పాత్రను ప్రత్యక్షంగా చూశానని సోనూసూద్ తెలిపారు. అప్పట్లో చంద్రబాబు హైదరాబాద్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు. ఆ నగర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర గొప్పదని చెప్పారు. కరోనాపై పోరాటంలో తామిద్దరి ఆలోచనలు కలవడం సంతోషమని వ్యాఖ్యానించారు.