Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్లమెంట్ లో ప్రతిపక్షాల రచ్చ …ప్రధాని ఆగ్రహం…

పార్లమెంట్ లో ప్రతిపక్షాల రచ్చ …ప్రధాని ఆగ్రహం
-మహిళలు, బలహీన వర్గాలకు మంత్రి పదవులు దక్కడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నరన్న ప్రధాని
– ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విసుర్లు
-వారంతా మహిళా వ్యతిరేకులు
-ఇలాంటి వారిని నేనెన్నడూ చూడలేదు
-కొత్త మంత్రులను పరిచయం చేసిన ప్రధాని
-ప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్షాలు
-మంత్రుల పరిచయాన్ని ఆమోదించిన ఉభయ సభలు
-లోక్ సభలో విపక్ష సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
-విపక్ష సభ్యులు ప్రవర్తన మార్చుకోవాలన్న రాజ్ నాథ్
-సంప్రదాయాన్ని ప్రతిపక్షాలు అగౌరవపరిచాయి: పీయూష్​ గోయల్​
-కొత్త మంత్రుల పరిచయం అనాదిగా వస్తున్న ఆచారం
-నెహ్రూ హయాం నుంచే ఉంది
-అడ్డుకోవడం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజునే ప్రతిపక్షాలు రచ్చ చేశాయి. కొత్త మంత్రులను సభకు ప్రధాని నరేంద్ర మోదీ పరిచయం చేసే క్రమంలో ప్రతిపక్ష ఎంపీలు నానా యాగీ చేశారు. వారిని పరిచయం చేసేందుకు మోదీ లేచీలేవంగానే నినాదాలతో హోరెత్తించారు. ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో ప్రధాని మోదీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు మంత్రులుగా అవకాశం రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వారంతా మంత్రులుగా ప్రమాణం చేయడాన్ని ప్రతి ఒక్కరూ గౌరవంగా, గర్వంగా భావించాలని అన్నారు. కొత్త మంత్రుల్లో కొందరు రైతుల బిడ్డలున్నారని, మరికొందరు ఓబీసీ వర్గాలకు చెందిన వారని ఆయన చెప్పారు.

ఆ తర్వాత రాజ్యసభలోనూ ప్రతిపక్షాల నుంచి అదే నిరసన ఎదురైంది. దీంతో గ్రామీణ ప్రాంతాల వారు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు మంత్రులవడాన్ని గౌరవంగా భావించాలన్నారు. కానీ, మహిళా వ్యతిరేక భావాలున్న కొందరు.. మహిళా మంత్రులను పరిచయం చేయకుండా అడ్డుకుంటున్నారని, పార్లమెంట్ లో అలాంటి వారిని తానెప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు.

కొత్తగా మంత్రులైన వారి జాబితాను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు అందజేసిన ప్రధాని.. వారిని పరిచయం చేసే అవకాశం కల్పించవలసిందిగా కోరారు. దానిని ఆమోదిస్తున్నట్టు ఉభయ సభలు ప్రకటించాయి.

ఆ తర్వాత కూడా ప్రతిపక్షాలు పదే పదే రభస చేయడంతో లోక్ సభను స్పీకర్ 2 గంటల వరకు వాయిదా వేశారు. ‘‘మీరు కూడా ఒకప్పుడు అధికారంలో ఉన్నారు కదా. సభ గౌరవాన్ని దిగజార్చకండి. మంచి సంప్రదాయాన్ని మీరు నాశనం చేస్తున్నారు. కొంచెం సభా మర్యాద పాటించండి’’ అని ప్రతిపక్ష ఎంపీలకు ఆయన సూచించారు. కొత్త మంత్రులను పరిచయం చేయనివ్వకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడం 24 ఏళ్ల చరిత్రలో ఇదే ప్రథమమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ విపక్ష సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నూతన మంత్రి వర్గ సభ్యులను పరిచయం చేసే సమయంలో ఈ విధంగా ప్రవర్తించడం సబబు కాదని అన్నారు. సభ్యుల ప్రవర్తనలో మార్పు రావాలని సూచించారు.

ఆ తర్వాత కూడా విపక్ష సభ్యులు తమ ఆందోళనలు కొనసాగించారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాయిదా తీర్మానాలకు అవకాశం ఇవ్వాలంటూ ఎలుగెత్తారు. దాంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

అంతకుముందు, ప్రధాని మోదీ ప్రసంగిస్తూ… సభలో అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. క్యాబినెట్ లో ఎస్సీలు, మహిళల ప్రాతినిధ్యం శుభపరిణామం అని పేర్కొన్నారు.

ప్రతిపక్షాల తీరుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇవ్వాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు, కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకున్నప్పుడు.. వారిని సభకు పరిచయం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని, జవహర్ లాల్ నెహ్రూ హయాం నుంచే ఈ ఆచారం కొనసాగుతోందని గుర్తు చేశారు.

కానీ, ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు అగౌరవ పరిచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల తీరును ఖండిస్తున్నట్టు చెప్పారు. రాజ్యసభ చైర్మన్ ప్రసంగాన్ని అడ్డుకోవడం వారి దుష్ట సంప్రదాయానికి నిదర్శనమన్నారు. ఇలాంటి సంప్రదాయాలను అడ్డుకోవడం పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారని మండిపడ్డారు. కొత్త మంత్రులను సభకు పరిచయం చేయనివ్వకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

 

Related posts

సీఎం జగన్ ను నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం: టీజేఆర్ సుధాకర్ బాబు వార్నింగ్!

Drukpadam

జ‌గ‌న్ ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన డాక్టర్ గురుమూర్తి

Drukpadam

మమ్ములను గౌరవించే పార్టీలతోనే మా పొత్తులు …కూనంనేని!

Drukpadam

Leave a Comment