Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాల్సిందేనంటున్న ‘సుప్రీం’ మాజీ న్యాయమూర్తులు

రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాల్సిందేనంటున్న ‘సుప్రీం’ మాజీ న్యాయమూర్తులు
-ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు తప్పితే క్రూరమైన చట్టాలకు తావులేదు
-ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నాయి
-84 ఏళ్ల స్టాన్‌స్వామికి బెయిలు నిరాకరణతో మనం మనుషులమేనా అన్న అనుమానం కలుగుతోంది
-వీలైనంత త్వరగా ఈ చట్టాలకు స్వస్తి పలకాలి

ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన రాజద్రోహం, ఉపా చట్టాలను రద్దు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు డిమాండ్ చేశారు. ఈ చట్టాలు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపైనే ఉందన్నారు. దుర్వినియోగమవుతున్న ఈ చట్టాలను సమీక్షించి అందులోని రాజ్యాంగ వ్యతిరేక అంశాలను కొట్టివేయాలని కోరారు. ‘ప్రజాస్వామ్యం, అసమ్మతి, అమానుషమైన చట్టాలు’ అంశంపై ‘క్యాంపెయిన్ ఫర్ జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ రీఫామ్స్’ సంస్థ నిన్న నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం, జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ మదన్ బి.లోకుర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు తప్పితే క్రూరమైన చట్టాలకు ఎంతమాత్రమూ తావులేదన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజద్రోహ చట్టం ఉండడం విచారకరమన్నారు. ఉద్యమాల్లో పాల్గొన్నంత మాత్రాన అది రాజద్రోహం చట్టం కిందికి రాదన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ చట్టాలకు స్వస్తి పలకాలన్నారు.

84 ఏళ్ల స్టాన్‌స్వామికి బెయిలు మంజూరు చేయకపోవడం చూస్తుంటే మనం మనుషులమేనా? మానవత్వం ఉందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఏళ్ల తరబడి నిర్బంధంలో ఉండి నిర్దోషులుగా బయటపడిన వారికి పరిహారం చెల్లించాల్సిందేనని అన్నారు. ఉగ్రవాద చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి బెయిలు ఇస్తే సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలు వస్తాయోనని జిల్లా కోర్టులు భయపడుతున్నాయని మాజీ న్యాయమూర్తులు పేర్కొన్నారు. కాబట్టి అస్పష్టంగా ఉన్న చట్టాలను కొట్టివేయాల్సిందేనని, వాటిలో సమూల మార్పులు చేస్తే తప్ప అంగీకరించేది లేదని తేల్చి చెప్పాలని జస్టిస్ దీపక్ గుప్తా పేర్కొన్నారు.

Related posts

వైఎస్ వివేకా హత్య కేసు విచారణను హైదరాబాదు సీబీఐ కోర్టుకు బదిలీ చేసిన సుప్రీం!

Drukpadam

వైసీపీ దోపిడీదార్లతో టీడీపీ యుద్ధం: నారా లోకేశ్

Ram Narayana

మనవరాలికి జన్మనిచ్చిన నాయనమ్మ… సరోగసీలో కొత్త కోణం!

Drukpadam

Leave a Comment