Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఖమ్మం లో లేడీ కిలాడి … లాడ్జ్ లో మకాం చివరికి కటకటాలు

ఖమ్మం లో లేడీ కిలాడి … లాడ్జ్ లో మకాం చివరికి కటకటాలు
-మంగళగిరి విజయలక్ష్మి.. ఖమ్మంలో వాణి.. ఆధార్ కార్డుతో అడ్డం తిరిగిన కథ
-రిటైర్డ్ ఆర్డీవో వాణి పేరుతో రూమ్‌ బుక్ చేసింది
-రూమ్ క్లిన్ చేస్తుండగా దొరికిన ఆమె అసలు ఆధార్ కార్డు
-నాలుగు నెలలుగా లాడ్జ్ లోనే మకాం
-తన భర్త అమెరికా నుంచు వచ్చినాక ఖాళీ చేస్తానని చెప్పిన వైనం
-అద్దె ఇవ్వకపోగా వరిదగ్గరే అప్పు తీసుకున్న కిలాడీ

రిటైర్డ్ ఆర్డీవో వాణి పేరుతో రూమ్‌ బుక్ చేసింది. భూముల వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా వచ్చానని చెప్పింది. నమ్మేసిన లాడ్జి సిబ్బంది రాచమర్యాదలు చేశారు. ఎదురు డబ్బులు కూడా ఇచ్చారు. కానీ చివరికి.. ఆమె అసలు రూపం తెలిసి అవాక్కు అయ్యారు .

ఖమ్మంలో కిలాడీ లేడీ బాగోతం వెలుగుచూసింది. ఆర్డీవోనంటూ హల్‌చల్ చేసింది. లాడ్జికి డబ్బులు చెల్లించకుండా వారినే నమ్మించి బురిడీ కొట్టించింది. ఎదురు డబ్బులు కూడా వసూలు చేసింది. మాజీ డీజీపీ భార్యనని.. తన తండ్రి సుప్రీం కోర్టు జడ్జి అంటూ ఓ రేంజ్‌లో కల్లబొల్లి మాటు చెప్పి అందినకాడికి డబ్బులు గుంజింది. డబ్బులు తిరిగివ్వాలని అడిగితే రేపోమాపో ఇచ్చేస్తానంటూ వాయిదా వేస్తుండడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చింది. తీరా ఆమె గదిలో దొరికిన ఆధార్ కార్డుతో కథ అడ్డం తిరగింది. లాడ్జి మేనేజర్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

గత మార్చి 27 వ తేదీన ఖమ్మంలోని బడా లాడ్జి విష్ణు రెసిడెన్సీలో దిగిందో మహిళ. వాణి అనే పేరుతో రూమ్ బుక్ చేసుకుంది. తాను రిటైర్డ్ ఆర్డీవోనని.. భూముల వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా ఖమ్మం వచ్చినట్లు చెప్పి లాడ్జి సిబ్బందితో పరిచయం చేసుకుంది. ఆధార్ కార్డు అడిగితే దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. తాను రిటైర్డ్ డీజీపీ నందన్ కుమార్ భార్యనని చెప్పడంతో లాడ్జి సిబ్బంది నమ్మేశారు. తన తండ్రి సుప్రీం కోర్టులో జడ్జి అని నమ్మబలికింది.

అన్ని రోజులుగా లాడ్జిలో ఉంటున్న వాణి.. రూమ్ అద్దె చెల్లించడంలేదు. దానికి తోడు లాడ్జి ఓనర్ వద్దనే రూ.80 వేల నగదు తీసుకుంది. తన భర్త అమెరికా వెళ్లారని.. రాగానే ఖాళీ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. తమ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని లాడ్జి సిబ్బంది అడిగితే రేపుమాపు అంటూ వాయిదాలు వేస్తూ వస్తోంది. డబ్బులు ఇవ్వాల్సిందేనని గట్టిగా అడగడంతో ఎదురుదాడికి దిగింది. లాడ్జి సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడింది.

తీరా ఈ నెల 23న ఆమె గది శుభ్రం చేస్తుండగా ఆధార్ కార్డు బయటపడడంతో కథ అడ్డం తిరిగింది. కిలాడీ లేడీ బాగోతం బయటపడింది. ఆమె వాణి కాదు.. విజయలక్ష్మి అని తేలడంతో షాక్‌కి గురయ్యారు. ఆధార్ కార్డులో పెద్దాడ విజయలక్ష్మి, భర్త పేరు కృష్ణమూర్తి గుంటూరు జిల్లా మంగళగిరి అని ఉండడంతో మాయలేడీ గుట్టురట్టైంది. మోసపోయామని గ్రహించిన లాడ్జి మేనేజర్ శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించారు. సుమారు నాలుగు నెలలుగా ఆమె చెల్లించాల్సిన అద్దె నగదు రూ.1.80 లక్షలతో పాటు తాము ఇచ్చిన నగదు రూ.80 వేలు ఇప్పించాలని.. మోసం చేసిన విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిలాడీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో గతంలో కూడా ఆమె పలు మోసాలకు పాల్పడినట్లు తేలింది. ఏకంగా ఐఏఎస్ అధికారినంటూ చీటింగ్ చేసినట్లు వెల్లడైంది.

Related posts

పై అధికారిపై ఇసుక తెచ్చి చల్లిన కింద అధికారి …షాక్ గురైన సిబ్బంది!

Drukpadam

మళ్లీ అదే సీన్.. విమానంలో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన!

Drukpadam

మధ్యప్రదేశ్ లో సీరియల్ కిల్లర్… నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులే అతడి లక్ష్యం!

Drukpadam

Leave a Comment