దళితులకు పది లక్షల సహాయంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
ఇవి కేసీఆర్ జిత్తుల్లో భాగమేనని … ఓట్ల కోసం కొత్త ఎత్తులని ట్విట్
పది లక్షల రూపాయల సాయమంటూ మోసం చేస్తున్నాడంటూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విసుర్లు
ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు
మళ్లీ మళ్లీ మోసపోతే మనదే తప్పు
తెలంగాణ సమాజమా ఆలోచన చెయ్
ఓట్ల వాసన రాగానే నోట్ల కట్టలతో టీఆర్ఎస్ స్వైరవిహారం చేస్తోంది
తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగనుండడంతో ఆ నియోజక వర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లు ఎదురుచూసినా రాష్ట్రంలోని పేదలకు రూ.10 వేల రుణం కూడా ఇవ్వని పాలకుడు ఇప్పుడు ఉప ఎన్నిక ఉండడంతో దళితులకు రూ.10 లక్షల సాయం ఇస్తామంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
‘ఏళ్లకేళ్లు పడిగాపులు పడినా పట్టుమని పది వేలు రుణమివ్వని పాలకుడు… పది లక్షల రూపాయల సాయమంటూ కొత్త జిత్తుతో ఎత్తులు వేస్తున్నాడు. ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు… మళ్లీ మళ్లీ మోసపోతే మనదే తప్పు. తెలంగాణ సమాజమా ఆలోచన చెయ్’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
‘పచ్చి నిజం… పచ్చి మోసం.. తన కాళ్లపై తాను నిలబడదామని, ఆత్మగౌరవంగా బతుకుదామని అప్పు కోసం చెప్పులరిగేలా తిరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు మొండి చెయ్యి చూపే దుర్మార్గం నేడు గద్దెనెక్కి రాజ్యమేలుతోంది. ఓట్ల వాసన రాగానే నోట్ల కట్టలతో స్వైరవిహారం చేస్తోంది’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఈ సందర్భంగా ఈనాడు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తుంటారని, ఇలాంటి వారికి కార్పొరేషన్లు ఇచ్చే రాయితీ రుణాలు సువర్ణావకాశమని అందులో పేర్కొన్నారు. ఇలాంటి రాయితీ రుణ పథకాలను తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా నిలిపేసిందని చెప్పారు.
2019-20 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల జారీని నిలిపేసిందని ఈనాడులో వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థలు అందించే రుణాలకు సైతం మోకాలడ్డిందని అందులో పేర్కొంది. దీంతో వేలాది మంది నిరుపేదలకు ఈ చర్య అశనిపాతంగా మారుతోందని పేర్కొన్నారు.