జనసేన-బీజేపీ నేతల సమన్వయ సమావేశం.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు!
-హాజరైన పవన్, సోమువీర్రాజు , నాదెండ్ల మనోహర్, పురందేశ్వరి తదితరులు
-ఆర్థిక స్థితి దిగజారడానికి ప్రభుత్వ తీరే కారణమని విమర్శ
-కరోనా థర్డ్ వేవ్ పై జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన
రాష్ట్ర ఆర్థిక పరిస్థి, ముందుచూపులేని ప్రభుత్వ వైఖరి వల్ల దిగజారిపోయందని బీజేపీ,జనసేన సమన్వయకమిటీ రాష్ట్రప్రభుత్వం పై ధ్వజమెత్తింది. ప్రభుత్వానికి ఎలాటి ప్రణాళిక లేకుండా వ్యవహరించడమం వల్ల రాష్ట్ర ఆర్థికపరిస్థితి దిగజారిందని విమర్శలు గుప్పించింది.
జనసేన-బీజేపీ నేతల సమన్వయ కమిటీ గత రాత్రి విజయవాడలో సమావేశమైంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్చార్జ్ సునీల్ దేవధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు. తాజా రాజకీయ, పాలనా పరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. ఆర్థిక పరమైన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుతెన్నులు, నిబంధనల ఉల్లంఘనపై కేంద్రానికి వెళ్లిన ఫిర్యాదులపైనా సమావేశంలో చర్చించారు.
అలాగే, కరోనా సెకండ్వేవ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపైనా చర్చించిన నేతలు.. థర్డ్ వేవ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.