Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆఫ్ఘన్ భూభాగం ఉగ్రవాదుల అడ్డా కాకూడదు: భారత్!

ఆఫ్ఘన్ భూభాగం ఉగ్రవాదుల అడ్డా కాకూడదు: భారత్!
-ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమితిలో భారత ప్రతినిధి వ్యాఖ్యలు
-ఆఫ్ఘనిస్థాన్‌లో భయంకరమైన మానవ హక్కుల సంక్షోభం
-ఆఫ్ఘన్ల ప్రాథమిక హక్కులను కాలరాయడంపై ఆందోళన

ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు పూర్తిగా హస్తగతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆప్ఘన్ ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు. దీనిపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ వేదికపై భారత ప్రతినిధి ఇంద్రమణి పాండే మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడంపై ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు మద్దతుగా నిలవాలని ప్రపంచ దేశాలను ఆయన కోరారు. ఆఫ్ఘన్ భూభాగం జైషే మహ్మద్, లష్కర్-ఏ-తాయిబా వంటి ఉగ్రవాద ముఠాలకు అడ్డాగా మారకూడదని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో భయంకరమైన మానవ హక్కుల సంక్షోభం తలెత్తిందని పాండే అభిప్రాయపడ్డారు.

సాధ్యమైనంత త్వరగా ఆఫ్ఘన్ భూభాగంలో పరిస్థితులు చల్లబడాలని భారత్ కోరుకుంటున్నట్లు పాండే చెప్పారు. ప్రస్తుత పరిస్థితితో సంబంధాలున్న వర్గాలు ఈ ప్రాంతంలోని ప్రజల మానవీయ, భద్రతా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆఫ్ఘన్ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఏర్పాటు కావాలని భారత్ ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆఫ్ఘన్ మహిళల స్వరం, పిల్లల కలలు, మైనార్టీల హక్కులను గౌరవించాలని సూచించారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో కేవలం వారానికి సరిపడా వైద్య సరఫరాలు మాత్రమే వున్నాయి!: ప్రపంచ ఆరోగ్య సంస్థ

వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
కాబూల్ ఎయిర్‌పోర్టులో తగ్గని టెన్షన్
వాణిజ్య విమానాల ల్యాండింగ్ కష్టం
ప్రజలను తరలించేందుకు వచ్చే ఖాళీ విమానాలు కూడా సాయం చేయలేని స్థితి

తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘనిస్థాన్‌లో అవసరమైన వైద్య సరఫరాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రస్తుతం తమ వద్ద ఉన్నవి కేవలం ఒక వారం రోజులకు మాత్రమే సరిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో మధ్యప్రాచ్య ప్రాంత అధినేత అహ్మద్ అల్-మంధారి వెల్లడించారు.

‘‘ఉన్నవాటిలో 70 శాతం వైద్య సామగ్రిని ఆరోగ్య కేంద్రాలకు విడుదల చేశాం’’ అని ఆయన చెప్పారు. దుబాయిలో 500 మెట్రిక్ టన్నుల ఔషధాలు, తదితర వైద్య ఉత్పత్తులు నిల్వ ఉన్నాయని చెప్పిన ఆయన.. కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాటిని ఆఫ్ఘన్‌కు తీసుకురావడం కష్టమని అన్నారు. ఆఫ్ఘన్లను తరలించడానికి ఖాళీగా వస్తున్న విదేశీ విమానాలు కూడా సాయం చేయలేని స్థితి ఉందని ఆయన వివరించారు.

ఇలాంటి మానవీయ అవసరాలున్న ఉత్పత్తులను ఆఫ్ఘన్‌కు తరలించేందుకు హ్యూమనిటేరియన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ కలిసి పిలుపునిచ్చాయి. కాగా, అమెరికా దళాలు కాబూల్ నుంచి ఆఫ్ఘన్లను తరలించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ఇటీవలే అమెరికాకు తాలిబన్లు హెచ్చరికలు చేశారు. ఒప్పుకున్న ఆగస్టు 31 డెడ్‌లైన్ తర్వాత అమెరికా దళాలు తమ దేశంలో ఉండకూడదని తేల్చిచెప్పారు.

Related posts

తెరాస పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఘాటు వ్యాఖ్యలు…

Drukpadam

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరు … 80 కి పైగా సీట్లు ఖాయం సీఎల్పీ నేత భట్టి…

Drukpadam

బీజేపీ మత రాజకీయాలపై మండిపడ్డ కేటీఆర్ …

Drukpadam

Leave a Comment