తరలింపే తక్షణ ప్రధాన కర్తవ్యం: 31 పార్టీల అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టీకరణ!
-సమావేశం పాల్గొన్న నామా నాగేశ్వరరావు, మిథున్ రెడ్డి
-మోదీ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం జరిగిన భేటీ
-క్లిష్ట పరిస్థితుల్లో ఆఫ్ఘన్ నుంచి తరలింపు చర్యలు చేపట్టాం
-ప్రతి ఒక్క భారతీయుడిని సురక్షితంగా తరలించాలి
-పాల్గొన్న ఆఫ్ఘన్లోని భారత రాయబారి రుద్రేంద్ర తాండన్
ఆఫ్ఘనిస్థాన్ లో మారిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మధ్యాహ్నం జరిగిన అఖిలపక్ష సమావేశానికి 31 విపక్ష పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా హాజరయ్యారు.
ఆప్ఘనిస్థాన్ నుంచి భారత్ కు తమను తరలించాలని కోరుతూ 15 వేల మంది భారత ప్రభుత్వాన్ని సంప్రదించారని జైశంకర్ తెలిపారు. అమెరికా, రష్యా, చైనా తదితర దేశాలు చేపడుతున్న తరలింపు చర్యలను కూడా జైశంకర్ వివరించినట్లు సమాచారం. సమావేశానంతరం కొన్ని వివరాలను ట్విట్టర్ ద్వారా జైశంకర్ వెల్లడించారు.
అత్యంత కఠిన పరిస్థితుల్లో తరలింపు చర్యలను తాము చేపట్టామని జైశంకర్ తెలిపారు. ముఖ్యంగా ఎయిర్ పోర్టు వద్ద పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. ఆప్ఘన్ నుంచి తరలింపు ప్రక్రియే ప్రస్తుతం తమకు అత్యంత ప్రాధాన్యమైనదని తెలిపారు.
ఆఫ్ఘన్లో తాలిబన్లు రెచ్చిపోతుండడంతో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. విదేశాంగ మంత్రి జయశంకర్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్థాన్లో భారతీయుల తరలింపులో తమ వైఖరిని అఖిల పక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం వివరిస్తోంది.
టీఆర్ఎస్ నుంచి ఈ సమావేశానికి నామా నాగేశ్వరరావు, వైసీపీ నుంచి మిథున్రెడ్డి హాజరయ్యారు. దేశంలోని ఇతర పార్టీల నుంచి కూడా ఆయా పార్టీల ఎంపీలు ఒక్కొక్కరు చొప్పున ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
ఆఫ్ఘన్లోని భారత రాయబారి రుద్రేంద్ర తాండన్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ శృంగ్లా కూడా ఇందులో పాల్గొని పలు విషయాలను రాజకీయ నేతలకు వివరిస్తున్నారు. ఆఫ్ఘన్ నుంచి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు దశల్లో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. మరికొందరిని తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తోంది.