పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఎంపిక…
-సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్
-ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ పార్టీ
-ఓ ఎస్సీ నేతకు సీఎం పదవి
-చన్నీ ఎంపిక ఏకగ్రీవంగా జరిగిందన్న హరీశ్ రావత్
పంజాబ్ కాంగ్రెస్ లో హైడ్రామా కు తెరపడింది .నిన్నటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్ అమరిందర్ సింగ్ అధిష్టానం సూచనమేరకు రాజీనామా చేయడంతో ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ నెలకొన్నది . ఎమ్మెల్యేతో అధిష్టానం దూతలు భేటీ అయ్యి వారి అభిప్రాయాలూ తీసుకున్నారు. రకరకాల అభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం . ముగ్గురి నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. చివరకు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు , కేంద్ర మాజీమంత్రి అంబికా సోని పేరుకూడా వినిపించింది. ఆమె ను రాహుల్ గాంధీ సీఎం గా భాద్యతలు చేపట్టాలని కోరగా ఆమె తిరస్కరించినట్లు తెలిసింది. ఆమె పంజాబ్ లో సిక్కు ని కాకుండా వేరే వ్యక్తిని పెడితే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళుతుందని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది. పీసీసీ అధ్యక్షుడిగా ఇటీవలనే భాద్యతలు చేపట్టిన ప్రజాకర్షక నేత నవజ్యోత్ సింగ్ సిద్దు ను పెడితే ఎలా ఉంటుందని కూడా కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలు చేశారని సమాచారం . అయితే అమరిందర్ కూడా ఆయనకు ఒకరి పొడ ఒకరికి గిట్టదు కనుక పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందని భావించిన అధిష్టానం ఎమ్మెల్యే ల అభిప్రాయాలు కూడా పరిగణన లోకి తీసుకోని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ చన్నీ సీఎం గా ఎంపిక చేశారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో, తదుపరి సీఎం ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ చరణ్ జిత్ సింగ్ చన్నీ పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఏకగ్రీవంగా ఎంపికైనట్టు స్పష్టం చేశారు.
చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. చన్నీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయనకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వం సామాజిక న్యాయం పాటించినట్టయింది. కాగా, చన్నీ ఎంపికపై కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ కాసేపట్లో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలవనున్నారు.