గత రాత్రి అదృశ్యమై అపార్ట్మెంట్ వద్ద విగతజీవిగా కనపడిన బాలిక…
-విశాఖలోని అగనంపూడిలోని శనివాడలో ఘటన
-అపార్ట్మెంటు వద్ద పనిచేసుకుంటూ ఉపాధి పొందుతోన్న బాలిక కుటుంబం
-అక్కడే ఆమె విగతజీవిగా కనపడ్డ వైనం
-బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు, స్థానికుల ఆందోళన
గత రాత్రి అదృశ్యమైన ఓ బాలిక అపార్ట్మెంట్ వద్ద విగతజీవిగా కనపడడం విశాఖలోని అగనంపూడిలో శనివాడలో అలజడి రేపింది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఓ అపార్ట్మెంట్ వద్ద 13 ఏళ్ల ఓ బాలిక కనపడకుండా పోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు వెతకడం ప్రారంభించారు. చివరకు అపార్ట్మెంట్ వద్దే ఆ బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
ఆ బాలిక విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డి పేటకు చెందిన ఓ దంపతుల కుమార్తె. ఆ కుటుంబం ఉపాధి కోసం విశాఖలోని అగనంపూడికి వచ్చి ఉంటోంది. అక్కడే ఓ అపార్ట్మెంట్లో ఆ కుటుంబం పనిచేస్తోంది. వారు పనిచేస్తోన్న అపార్ట్మెంట్ వద్దే బాలిక మృతదేహం కనిపించడం గమనార్హం. అంతకు ముందు రోజు కనపడ కుండా పోయిన బాలిక కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. కానీ ఆచూకీ లభించలేదు . రెండవరోజు వాళ్ళు ఉంటున్న అపార్ట్ మెంట్ దగ్గర విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ బాలికను ఎవరో కిడ్నప్ చేసి అత్యాచారం చేసి ఆమె గుర్తు పడుతుందని హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఈ ఘటనపై కూర్మన్నపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.