Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఒమిక్రాన్​ సోకిన మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నాం: మంత్రి హరీశ్ రావు!

ఒమిక్రాన్​ సోకిన మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నాం: మంత్రి హరీశ్ రావు!

  • ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసుల గాలింపు
  • రెండు కేసులూ ఎట్ రిస్క్ జాబితాలో లేని దేశాల నుంచే
  • ఆ దేశాల నుంచి వచ్చిన వారి నుంచి ర్యాండమ్ గా నమూనాల సేకరణ
  • వాటిలోనే ఒమిక్రాన్ బయటపడిందన్న మంత్రి
  • ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి
  • మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలని సూచన

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఒమిక్రాన్ కేసులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఎట్ రిస్క్ (ముప్పు జాబితాలోని) దేశాల నుంచి వచ్చిన వారిలో ఈ కేసులు రాలేదని, వేరే దేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ గా తేలిందని ఆయన చెప్పారు. నిన్న రాత్రి ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, వెంటనే వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారని తెలిపారు.

పాజిటివ్ వచ్చిన తలీబ్ ఇక్రాన్ అనే మహిళను వెంటనే టిమ్స్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. 23 ఏళ్ల అబ్దుల్లా అహ్మద్ అనే యువకుడి ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో ఉన్నామని, ఇటు వైద్యశాఖ అధికారులు, అటు పోలీసులు అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నారని హరీశ్ వెల్లడించారు. ఇప్పటిదాకా నమోదైన కేసులను చూస్తే వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని చెప్పారు. అయితే, వ్యాధి వ్యాప్తి మాత్రం ఎక్కువగా ఉందని వివరించారు. బ్రిటన్ లో రెండు మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సిద్ధమైందని హరీశ్ వివరించారు. అందరూ దయచేసి వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీకా వేయించుకోవడం, మాస్కు పెట్టుకోవడం వంటి వాటితోనే ఒమిక్రాన్ వ్యాప్తిని నియంత్రించగలుగుతామని సూచించారు. జనసమ్మర్థ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్లొద్దని, ఎక్కడా గుమికూడవద్దని స్పష్టం చేశారు.

ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ .. 95 శాతం పూర్తయిందని, 18 ఏళ్లు దాటిన 3 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి దాకా కోటీ 50 లక్షల 93 వేల 960 మందికి టీకాలు ఇచ్చామన్నారు. మొత్తం జనాభాలో 54 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. మిగతా వాళ్లూ టీకా వేయించుకోవాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి దానిపైన ప్రచారం కూడా చేస్తున్నామన్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత జీనోమ్ సీక్వెన్స్ చేయడానికి రెండు మూడు రోజుల టైం పడుతుందని, దాని ప్రొసీజర్ అలాంటిదని హరీశ్ తెలిపారు. హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో ఉన్న సీడీఎఫ్ డీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను.. జన్యు క్రమ విశ్లేషణ కోసం పంపుతున్నట్టు చెప్పారు. విమానాశ్రయంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారి కరోనా శాంపిళ్లలో ర్యాండమ్ గా 2 శాతం శాంపిళ్లను ఎంపిక చేసి సీడీఎఫ్ డీకి పంపిస్తున్నామన్నారు.

ముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చే వారిలో కరోనా పాజిటివ్ వస్తే.. అన్ని శాంపిళ్లనూ పంపిస్తున్నామని తెలిపారు. వారిని గచ్చిబౌలిలోని టిమ్స్ లో పెట్టి చికిత్స ఇస్తున్నామన్నారు. ఒమిక్రాన్ నెగెటివ్ వస్తేనే బయటకు పంపుతున్నామని చెప్పారు. ఇప్పుడు వచ్చిన రెండు కేసులూ ర్యాండమ్ టెస్టుల్లో గుర్తించినవేనన్నారు. ఇప్పటిదాకా ప్రయాణాలపై ఆంక్షలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదని చెప్పారు.

ముందుజాగ్రత్తగా 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధం చేసి పెట్టుకున్నామని, ఆక్సిజన్ కొరత రాకుండా చూస్తున్నామని హరీశ్ తెలిపారు. బెడ్లనూ సిద్ధం చేశామన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఒమిక్రాన్ కట్టడికి ప్రజల నుంచి కూడా సహకారం అవసరమన్నారు.

Related posts

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా పై తమిళనాడు సీఎం పళని స్వామి అభ్యంతరం

Drukpadam

భారత్​ లో కరోనా సెకండ్​ వేవ్ పతాక స్థాయిని దాటింది .​.. కేంబ్రిడ్జి అధ్యయనంలో వెల్లడి

Drukpadam

భారత్ లో అందరికి వ్యాక్సిన్ త్వరగా అందాలంటే ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి

Drukpadam

Leave a Comment