Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల గోడు పట్టించుకోని కేసీఆర్ సర్కార్ …

జర్నలిస్టుల గోడు పట్టించుకోండి కేసీఆర్ సార్
జర్నలిస్ట్ సమస్యల పరిష్కరంలో నిర్లక్ష్యం
ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోని వైనం
అందని ద్రాక్షగానే …… ఇల్లు ,ఇళ్ల స్థలాలు
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు , అందమైన కాలనీలు
అక్రిడేషన్ లది అదే పరిస్థితి
జీవం లేని హెల్త్ కార్డులుకనికరించని ఆసుపత్రులు
తమ సమస్యలు చెప్పుకునేందుకు సైతం అవకాశం ఇవ్వని పాలకులు

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు దాటింది.కానీ జర్నలిస్టులకు ఇచ్చిన వాగ్దానాలు ,చెప్పినమాటలు సీఎం కేసీఆర్ విస్మరించారు. ఇప్పటికైనా మసమస్యలు పట్టించుకోండి కేసీఆర్ సార్ అని జర్నలిస్ట్ లోకం కోడై కూస్తుంది. కేసీఆర్ ప్రతిదానిపై స్పందిస్తారు … హామీలు కూడా ఇస్తారు….వాటి మంచి చెడ్డలగురించి ఆరా తీస్తారు… కానీ జర్నలిస్టుల గోడు పట్టించు కోవడంలేదు . ఫలితంగా జర్నలిస్ట్ సమాజం కేసీఆర్ సర్కారుపై అసహనంగా ఉంది. నిత్యం ప్రజలకు పాలకులకు వారధిగా ఉంటూ సమాజ అభివృద్ధిలోను , నిర్మాణంలోను , ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడటంలో జర్నలిస్టుల పాత్ర తక్కువకాదు . అనేక కుంభకోణాలు వెలికితీసి ప్రభుత్వ ధనాన్ని కాపాడటంలో జర్నలిస్టుల పాత్ర అద్వితీయం . ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు సరిగా అందుతున్నాయా ?లేదా ? లోపాలు ఏమిటి ?లబ్ధిదారుల ఎంపికలు సరిగా జరుగుతున్నాయా ? లేదా అని వాచ్ డాగ్ ల్లా చూస్తూ సక్రమైన మార్గంలో నడిపించేందుకు ఫోర్త్ ఎస్టేట్ నిత్యం కృషి చేస్తున్న సంగతి చెప్పాల్సిన పనిలేదు . ఇది ఒక అత్యవసర సేవాకేంద్రంగా మారింది. 24 గంటలు పనిచేసే అతికొద్ది అంగాలలో మీడియా రంగం ఒకటిగా ఉంది . ఆలాంటి రంగంలో పని చేస్తున్న జర్నలిస్టులపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. సమాజ నిర్మాణంలో నాలుగోవ స్తంభంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. జర్నలిస్టుల సమస్యలను కనీసం వినేందుకు కూడా పాలకులకు తీరిక దొరకకపోవడం విచారకరం .

తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే అందరిలాగే తమబతుకులు బాగుపడతాయని జర్నలిస్ట్ సమాజం ఆశపడ్డది . అందుకు తెలంగాణ రాష్ట్రం కోసం జర్నలిస్టులు తమవంతు పాత్ర పోషించారు . దెబ్బలు తిన్నారు , వీపులు పగలగొట్టుకున్నారు . కెమెరాలు ధ్వంసం అయ్యాయి . యాజమాన్యాలు వారించినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే దీక్షతో పనిచేశారు. అంతకు ముందు పరాయి వాడు పాలించాడని ఇప్పుడు మనల్ని మనమే పరిపాలించుకుంటున్నామని అనుకున్నారు . కానీ ఆ ఆశలు నెరవేర లేదు . జర్నలిస్టులు సమస్యలు పరిస్కారం కాలేదు . ఎన్నికలకు ముందు మన ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన మాటలు నీటి మూటలైయ్యాయి. ఎన్నికల ప్రణాళికలో పెట్టిన అనేక అంశాలు బుట్ట దాఖలు అయ్యాయి. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కోసం అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2005 లో ఇచ్చిన 242 ,243 జి ఓ లు అమలుకు నోచుకోలేదు . వాటి పరిస్థితి ఏమిటో కూడా అంటూ పట్టని పరిస్థితి .

ప్రస్తుతం స్థానికమంత్రి దయతలిస్తే అక్కడక్కడా డబల్ బెడ్ రూమ్ ఇల్లు , లేదా ఇళ్లస్థలాలు అక్కడక్కడా ఇస్తున్నారు . ఇప్పటికే సిరిసిల్ల , జయశంకర్ భూపాలపల్లి , సిద్ధిపేట , మహబూబ్ నగర్ ,లాంటి చోట్ల స్థలాలు లేదా డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చారు. ఖమ్మం , వరంగల్,నల్గొండ ,లలో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన స్థలాలను సైతం వేరు డిపార్టుమెంట్లకు అప్పగించారు . ఇదేమంటే సుప్రీం కోర్ట్ లో కేసు ఉందని అంటున్నారు. సుప్రీం కోర్ట్ కేసుకు జిల్లాల్లో జర్నలిస్ట్ లకు ఇచ్చే స్థలాలకు సంబంధం ఉందా? . మన రాష్ట్రంలో ఇల్లు, ఇళ్లస్థలాలు వస్తాయని , ఉచిత ఆరోగ్యం అంది తమ ప్రాణాలు నిలబెట్టుకోవచ్చునని ,బస్సు పాస్ లు , ఇతర సంక్షేమ పథకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుతాయని , కేసీఆర్ తమను ఆదరించి అక్కున చేర్చుకుంటారని జర్నలిస్టులు భావించారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది జర్నలిస్టుల పరిస్థితి . ఉచిత వైద్యం అని ఊరించారు … హెల్త్ కార్డులు ఇస్తే అవి ఎక్కడ చెల్లు బాటు కానీ పరిస్థితి . ప్రభుత్వం ఇచ్చిన ఆ కార్డు తీసుకోని ఆసుపత్రికి వెళ్ళితే మెట్లు కూడా వెక్కనివ్వకుండా వెనక్కు పంపిన సంఘటనలు అనేకం . ఫలితంగా రాష్ట్రంలో 250 పైగా జర్నలిస్టులు వైద్యం సకాలంలో అందక మరణించారు . మరణించినవారందరు కేవలం 35 నుంచి 45 సంవత్సరాల లోపు వారే కావడం గమనార్హం .

దీనిపై టి యూ డబ్ల్యూ జె (ఐ జె యూ ) అద్వర్యం లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. దానికి వివిధ రాజకీయపార్టీలు , మీడియా ప్రముఖులు వచ్చి సంఘీభావం తెలిపారు . చివరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు స్పందించి సానుభూతితో అపాయంట్ మెంట్ ఇచ్చి సమస్యలు విన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకోక పోవడం దారుణాతి దారుణంగా జర్నలిస్ట్ లోకం భావిస్తున్నది .

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకోని పోయి జర్నలిస్ట్ సమాజానికి మేలు చేద్దామని అనుకున్న యూనియన్ లను యూనియన్ నేతలను కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడం పై జర్నలిస్ట్ లోకం ఆగ్రహంతో ఉంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు తిరిగినప్పుడు జర్నలిస్టులందరికి అందమైన కాలనీలు కట్టిస్తామని , వాటిని దేశంలోని మిగతా రాష్ట్రాల జర్నలిస్టులు చూసి అబ్బురపడాలని అందుకు ప్రత్యేక ఆర్కిటెక్ ను పంపించి డబల్ బెడ్ రూంలు కాదు విశాలంగా ఉండే విధంగా త్రిబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామని అందమైన కాలనీలు ఏర్పాటు చేస్తామని అందులో స్విమ్మింగ్ పూల్ , వాకింగ్ ట్రాక్ , కమ్యూనిటీ హాల్ , లైబ్రరీ, పార్క్ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఈ మాటలు ఒక్క హైద్రాబాద్ లోనే కాదు నిజామాబాద్ , కరీంనగర్ , వరంగల్ , ఖమ్మం లలో చెప్పారు. దీంతో జర్నలిస్టులు సంబరపడ్డారు .అప్పటి బడ్జెట్ లోనే (2015 ) దీనికి నిధులు పెట్టుకుందామని అన్నారు . అందుకు మీదే ఆలస్యం అని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటివరకు వాటికీ బడ్జెట్ గానీ అందమైన కాలనీ లు కానీ లేవు . ఇక హెల్త్ కార్డులు అందని ద్రాక్షలాగా మిగిలాయి. గతంలో ఎంప్లాయిస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ గా పేరు పెట్టి దానికి ఇ జె హెచ్ ఎస్ గా నామకరణ చేశారు . ఆతరవాత ఇ జె హెచ్ ఎస్ నుంచి జె (జర్నలిస్ట్ ) ను తొలగించి ఇ హెచ్ ఎస్ గా పెట్టారు . జర్నలిస్ట్ లు ఈ కేటగిరి కిందకు రారని అవమాన పరిచారు.

ఇక కరోనా మహమ్మారి వచ్చింది. తెలంగాణాలో వేలాది జర్నలిస్టుల కుటుంబాలు కోవిడ్ బారిన పడ్డాయి. యాజమాన్యాలు అనేక మంది జర్నలిస్టులను తొలగించాయి. కష్టకాలంలో ఆదుకొనే నాధుడు లేక సకాలంలో సరైన వైద్యం అందక అనేక మంది జర్నలిస్టులు కరోనా బారినపడి మరణించారు. ఒక లెక్క ప్రకారం తెలంగాణలోనే వివిధ జిల్లాలలో సుమారు 200 మంది వరకు జర్నలిస్టులు చనిపోయారని తెలుస్తుంది. వీరిని ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా 2 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించింది. కరోనా బారినపడిన జర్నలిస్టులకు మొదట హాస్పటల్ ఖర్చులకోసం 20 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తరువాత దాన్ని పదివేలకు తగ్గించింది. ఇప్పటికైనా కరోనా తో మరణించిన కుటుంబాలకు కనీసం 10 లక్షల రూపాయలు ఆర్థికసహాయం చేయాలనీ జర్నలిస్ట్ సంఘాలు కోరుతున్నాయి. పాలకులు జర్నలిస్ట్ లసమస్యలను పరిష్కరించడంలో ముందుకు రావాలని జర్నలిస్ట్ సమాజం కోరుకుంటుంది. అందుకు అనుగుణంగా పాలకులు ఇప్పటికైనా స్పందిస్తారని ఆశిద్దాం ….

Related posts

విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ఉదయలక్ష్మిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ…

Drukpadam

భారత పర్యాటకుల రాకతో పండుగ చేసుకుంటున్న అబుదాబి!

Drukpadam

అశోక్ గైహాలెట్ ప్రభుత్వ భేష్ ….యాచకులు కోసం వినూత్న పథకం!

Drukpadam

Leave a Comment