Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఓటర్ ఐడీని ఆధార్ తో లింక్ ఇలా చేస్తే సరి..!

ఓటర్ ఐడీని ఆధార్ తో లింక్ చేయాలా? ఇలా చేస్తే సరి..!

  • ఎస్ఎంఎస్, కాల్ ద్వారా అనుసంధానం
  • ఎలక్షన్ కమిషన్ పోర్టల్ నుంచీ చేసుకోవచ్చు
  • ఇదంతా స్వచ్ఛందమే

ఓటర్ ఐడీలను ఆధార్ తో అనుసంధానం చేసుకునే బిల్లుకి పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. దీంతో ఇది చట్టరూపం దాల్చినట్టే. ఇక మీదట కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఎన్నికల కమిషన్ అధికారులు ఆధార్ నంబర్ అడగనున్నారు.

ఇప్పటికే ఓటర్ హక్కు కలిగిన వారు సైతం ఆధార్ తో అనుసంధానించుకోవాల్సి (లింక్) రావచ్చు. దీనివల్ల ఒక్కరికే ఒకటికి మించిన ప్రాంతాల్లో ఓట్లు ఉంటే వెల్లడవుతుంది. తద్వారా డూప్లికేషన్ ను నివారించొచ్చని, దొంగ ఓట్లకు చెక్ పెట్టొచ్చన్నది కేంద్ర సర్కారు ఉద్దేశ్యం. అయితే ఓటు హక్కు కోసం ఆధార్ నంబర్ ఇవ్వడం స్వచ్ఛందమేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లు సందర్భంగా పార్లమెంటుకు స్పష్టం చేశారు.

ఓటర్ ఐడీతో ఆధార్ నంబర్ ను అనుసంధానించుకోవాలని కోరుకునే వారు ఇప్పుడే ఆ పనిచేసుకోవచ్చు. ఎస్ఎంఎస్, ఫోన్ కాల్, ఇంటర్నెట్ ద్వారా చేసుకునే సదుపాయం ఉంది. ఎస్ఎంఎస్ రూపంలో అయితే.. మీ ఓటర్ నంబర్ ను ముందుగా టైప్ చేయాలి. స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్ ను టైప్ చేయాలి. ఆ తర్వాత 51969 కు ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది.

ఫోన్ కాల్ రూపంలో లింక్ చేసుకోవాలనుకుంటే.. 1950కు కాల్ చేయాలి. అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఐవీఆర్ఎస్ చెప్పే సూచనలకు అనుగుణంగా, మీ ఓటర్ ఐడీ, ఆధార్ ఐడీ నంబర్ టైప్ చేస్తూ, ధ్రువీకరణ ఇవ్వడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

అదే ఇంటర్నెట్ ద్వారా అయితే https://voterportal.eci.gov.in/ పోర్టల్ కు వెళ్లి మెయిల్, ఫోన్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ అవ్వాలి. జిల్లా, రాష్ట్రం, పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, సంవత్సరం వివరాలతో మీ పేరు ఎక్కడున్నదీ సెర్చ్ చేయాలి. ఈసీ డేటాబేస్ లోని మీ ఓటు హక్కు వివరాలు కనిపిస్తాయి. దాని పక్కనే ఉండే ‘ఫీడ్ ఆధార్ నంబర్’ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. మీ ఆధార్ నంబర్, ఓటర్ ఐడీ, రిజిస్టర్డ్ ఈ మెయిల్ లేదా ఫోన్ నంబర్ ఇచ్చి సబ్ మిట్ చేస్తే ప్రక్రియ పూర్తయినట్టే.

Related posts

కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరు… సీఎం జగన్ ప్రకటనతో హృదయం ఉప్పొంగిందన్న చిరంజీవి

Drukpadam

ప్రతిభకు మార్కులే కొలమానం కాదు..ఓబీసీ కోటా యథాతథమంటూ సుప్రీం!

Drukpadam

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు…

Drukpadam

Leave a Comment