Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

యూపీ ప్రచారంలో కొత్తపుంతలు..వర్చువల్ సభలు

యూపీ ప్రచారంలో కొత్తపుంతలు..వర్చువల్ సభలు
-పార్టీల వారిగా వ్యూహం ఇదే..బీజేపీ,ఎస్పీ లు ముందుచూపు
-3డీ స్టూడియో మిక్స్ టెక్నాలజీ వినియోగం
-వర్చువల్ ఎన్నికల సభలు
-సామాజిక మాధ్యమాల సాయం
-బూత్ స్థాయిలో వర్చువల్ బృందాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడమే కాకుండా.. ఈ నెల 15 వరకు ప్రత్యక్షంగా ఎటువంటి ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలు, పాదయాత్రలు చేపట్టరాదంటూ నిషేధం విధించింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మూడో విడత విరుచుకుపడుతోంది. కొత్త కేసులు శనివారం ఒక్కరోజే 1.60 లక్షలు వెలుగు చూశాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత గరిష్ఠాలకు చేరడం ఖాయమని తేలిపోయింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని వర్చువల్ గా నిర్వహించడంపై దృష్టి సారించాయి. యూపీలో ప్రధాన పార్టీల ప్రచార వ్యూహాలను గమనించినట్టయితే..

బీజేపీ
యూపీలో ప్రచారానికి 3డీ స్టూడియో మిక్స్ టెక్నాలజీని బీజేపీ వినియోగించుకోనుంది. నేతలు రెండు భిన్న ప్రాంతాల్లో ఉన్నా కానీ వారిని ఒక వేదికపై చూపించేదే ఈ టెక్నాలజీ. దీంతో ప్రధానితోపాటు బీజేపీ అగ్రనేతలు ఢిల్లీ నుంచే యూపీలోని సభలను ఉద్దేశించి ప్రసంగించొచ్చు.

బీజేపీ ఇప్పటికే బూత్ స్థాయిలో 1.5 లక్షల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసింది. యూపీలోనే అని కాదు ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇదే పనిచేసింది. స్థానిక స్థాయిలో ప్రచారం చేపట్టే బృందాలను సిద్ధం చేసింది. ప్రజల్లో బీజేపీకి అనుకూల వాతావరణం కల్పించే దిశగా అవి పనిచేస్తాయి. ఇందుకోసం ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ ల సాయం తీసుకుంటాయి.

సమాజ్ వాదీ పార్టీ
డిజిటల్ ప్రచారంపై ఎప్పటి నుంచో వలంటీర్లకు ఎస్పీ శిక్షణ ఇస్తోంది. వర్చువల్ సభల ద్వారా ఓటర్లను చేరుకోవాలన్న ప్రణాళికలతో ఉంది. 400కుపైగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కార్యకర్తల వాట్సాప్ బృందాల్లో చేరాలంటూ ఒక వెబ్ లింక్ ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సామాజిక మాధ్యమాల సాయం తీసుకోనుంది.

కాంగ్రెస్
కరోనా కేసుల తీవ్రతను చూసిన యూపీ ఎన్నికల ప్రచార సారథి, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ 15 రోజుల పాటు కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. డిజిటల్ గా ఓటర్లను చేరుకోనున్నారు. శనివారం వర్చువల్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆమె ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఫేస్ బుక్, యూట్యూబ్ వేదికలుగా ప్రసారం చేసింది. లైవ్ సెషన్ ల రూపంలో ప్రజలతో ఆమె మాట్లాడనున్నారు.

బీఎస్పీ
ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ చురుగ్గా పాల్గొనడం లేదు. సీనియర్ నేత సతీష్ చంద్ర మిశ్రా ఒక్కరే ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ప్రత్యర్థి పార్టీల మాదిరి డిజిటల్ ప్రచార ప్రణాళికలు బీఎస్పీ వైపు నుంచి కనిపించడం లేదు.

ఆప్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సైతం డిజిటల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నెల 8న వారణాసిలో ఏర్పాటు చేసిన వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి సంజయ్ సింగ్ ప్రసంగించారు. సామాజిక మాధ్యమ సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోంది.

Related posts

Drukpadam

వైఎస్ షర్మిల పార్టీ పేరు వైయస్సార్ టీపీ .. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి!

Drukpadam

కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు!

Drukpadam

Leave a Comment