ప్రశాంత్ కిషోర్ రాజకీయపార్టీ పెట్టడానికి కేసీఆర్ ప్రోద్బలం ఉందా?
-రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రకటన
-కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నించి విఫలమైన ప్రశాంత్
-భావసారూప్య పార్టీలతో చర్చలు
-పీకే రాజకీయ పార్టీపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ
-ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం వచ్చిందనంటున్న ప్రశాంత్ కిశోర్
-పదేళ్లుగా తాను ప్రజల పక్షాన విధానాలు రూపొందించానన్న పీకే
-అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని వ్యాఖ్య
-ప్రజా సమస్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సి ఉందన్న ప్రశాంత్
-బీహార్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని ప్రకటన
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ లో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు .దీని వెనక సీఎం కేసీఆర్ ప్రోద్బలం ఉందా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు . నిన్నమొన్నటివరకు కాంగ్రెస్ లో చేరేందుకు వారి చుట్టూ తిరిగిన ప్రశాంత్ కిషోర్ తన నిర్ణయాన్ని సడన్ గా మార్చుకోవడాని కారణం ఏమిటా అని వెతుకుతున్న పరిశీలకులు కేసీఆర్ సలహా కారణమై ఉంటుందని అభిప్రాయపడుతున్నారు
గత కొంత కాలంగా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల వ్యూహానికి సంబందించిన భాద్యతలు కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు కూడా అందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తో పాటు రాహుల్ , ప్రియంకాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు . అవి ఒక కొలిక్కి వచ్చినట్లే వచ్చి తిరిగి బ్రేక్ ఆఫ్ అయింది . అంతకు ముందుకూడా ఆయన కాంగ్రెస్ తో చర్చలు జరిపి రాహుల్ ను ప్రధానిగా చేసేందుకు తాను ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తానని తెలిపారు . వివిధ పార్టీలతో ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఆయనకు సొంతగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం అందులో తన సొంత రాష్ట్రమైన బీహార్ లో పార్టీ పెడతానని ప్రకటించడం వెనక అసలు ఉద్దేశం ఏమిటి అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఆయన పార్టీ వెనక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నాడని అందువల్లనే కాంగ్రెస్ తో తన రాజకీయ ప్రయాణం కొనసాగించాలని భావించి వెనక్కు వచ్చారనే అభిప్రాయాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా చేయడం ఇష్టం లేక ఆయన చేత పార్టీ పెట్టించారని వాదనలు వినిపిస్తున్నాయి. అంటే కాకుండా బీహార్ లో బీజేపీకి వ్యతిరేకంగా బలంగా ఉన్న ఆర్జేడీ ని దెబ్బతీయాలనే వ్యూహం లో భాగమే ఇది అని సందేహాలు కూడా ఉన్నాయి. బీజేపీ కి మేలు చేసేందుకు కొందరు బీజేపీ వ్యతిరేకత పేరుతొ రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ పండితుల అభిప్రాయంగా ఉంది.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించినట్టు పైకి కనపడుతున్న దాని వెనక పెద్ద వ్యూహమే ఉన్నదనే సందేహాలు ఉన్నాయి. అంతేకాదు, నేడు ఆయన పార్టీని ప్రకటించనున్నట్టు కూడా ఉత్తరాది రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ట్విట్టర్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీహార్లో నిన్న భావసారూప్య పార్టీలతో పీకే చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తోంది.
కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పీకే ఇటీవల తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీని ప్రక్షాళన చేసి జవసత్వాలు నింపేందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే, పార్టీలోకి ఆయన రాకను కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు వ్యతిరేకించారు. ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ దేశంలోని వివిధ పార్టీలకు పనిచేస్తుండడం, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పీకే చర్చలు జరపడంతో ఆయన తీరుపై కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్లో పీకే చేరికకు ఫుల్స్టాప్ పడింది.
కాంగ్రెస్లో కీలక స్థానాన్ని ఆశించిన పీకేకు.. ఎన్నికల వ్యూహరచన కమిటీలో సభ్యుడిగా స్థానం కల్పిస్తామని సోనియా గాంధీ చెప్పడంతో మనసు మార్చుకున్న పీకే కాంగ్రెస్లో చేరబోవడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సొంత పార్టీ ప్రకటించబోతున్నారంటూ వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ పెడుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందరూ ఊహించినట్లుగానే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారా సంకేతం ఇచ్చారు. పదేళ్లుగా తాను ప్రజల పక్షాన విధానాలు రూపొందించానని, అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సి ఉందని, ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం వచ్చిందని ఆయన అన్నారు.
సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నానని, బీహార్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పారు. కాగా, తాను కాంగ్రెస్లో చేరబోనని ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్లో తన రాజకీయ కార్యకలాపాల కోసం ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే టీమ్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.