Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసు: నారాయణకు బెయిలు మంజూరు

పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసు: నారాయణకు బెయిలు మంజూరు
వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచిన పోలీసులు
నారాయణపై అభియోగాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి
వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలు మంజూరు
నారాయణ నైతికంగా తప్పించుకోలేడు: విజ‌య‌సాయిరెడ్డి
సాంకేతికంగా నారాయ‌ణ‌కు బెయిల్‌
నారాయ‌ణ కుటుంబానికి చెందిన విద్యా సంస్థ నుంచే పేప‌ర్లు లీక్‌
ఈ వ్య‌వ‌హారంలో ఎవ‌రు ఓడారో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంద‌న్న సాయిరెడ్డి

పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసులో అరెస్ట్ అయిన నారాయణ విద్యాసంస్థల అధినేత, ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిలు మంజూరైంది. ఈ కేసులో నిన్న ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు అనంతరం చిత్తూరు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట నారాయణను హాజరుపరిచారు.

అయితే, ఆయనపై పోలీసులు మోపిన అభియోగాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి సులోచనారాణి వ్యక్తిగత పూచీకత్తుపై నారాయణకు బెయిలు మంజూరు చేశారు. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ 2014లోనే రాజీనామా చేసినట్టు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు ఆధారాలు చూపించారు. ఆ వాదనలతో అంగీకరించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు.

బెయిలు లభించిన అనంతరం నారాయణ మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థల అధినేతగా తాను 2014లోనే తప్పుకున్నా, ఇంకా దాని అధినేతగానే ఉన్నానని పోలీసులు తనపై తప్పుడు అభియోగం మోపారని అన్నారు. దానితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని కోర్టుకు ఆధారాలు సమర్పించామని, దీంతో తనపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన న్యాయమూర్తి బెయిలు మంజూరు చేసినట్టు చెప్పారు.

నారాయణ నైతికంగా తప్పించుకోలేడు: విజ‌య‌సాయిరెడ్డి

టెన్త్ క్వ‌శ్చ‌న్ పేపర్ల లీకేజీ కేసులో అరెస్టయిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణకు బెయిల్ మంజూరైన వ్య‌వ‌హారంపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తాజాగా స్పందించారు. సాంకేతిక కార‌ణాల‌ను చూపి బెయిల్ తెచ్చుకున్నా.. నైతికంగా మాత్రం నారాయ‌ణ త‌ప్పించుకోలేర‌ని సాయిరెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

నారాయ‌ణ విద్యా సంస్థ‌ల చైర్ ప‌ర్స‌న్ హోదాలోనే నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసిన‌ట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే 2014లోనే ఆ హోదా నుంచి నారాయ‌ణ త‌ప్పుకున్నారు. ఇదే విష‌యాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నారాయ‌ణ బెయిల్ తెచ్చుకున్నారు.

నారాయ‌ణ‌కు బెయిల్ వ‌చ్చిన విష‌యంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించిన సాయిరెడ్డి… విద్యా సంస్థల ఛైర్మన్ పదవికి తానెప్పుడో రాజీనామా చేశానని చెప్పి బెయిలు తెచ్చుకున్నార‌ని తెలిపారు. సాంకేతికంగా నారాయ‌ణ‌ బయటపడి ఉండొచ్చున‌ని, అయితే నైతికంగా మాత్రం త‌ప్పించుకోలేర‌ని వ్యాఖ్యానించారు. నారాయ‌ణ కుటుంబానికి చెందిన సంస్థల్లో పేపర్లు బయటికొచ్చాయన్న సాయిరెడ్డి… ఈ వ్య‌వ‌హారంలో ఎవరు ఓడారో ప్రజలకు అర్థమైందని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

Related posts

ఉత్తర కొరియాలో ఆకలి చావులు నమోదు అయ్యే అవకాశం …మానవ హక్కుల విభాగం నివేదిక!

Drukpadam

చేతకాకే ప్రశాంత్ కిశోర్ ను తెచ్చుకున్నారు: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు!

Drukpadam

రాహుల్ గాంధీ బ్రిటన్ లో ప్రసంగంపై వివరణకు బీజేపీ నో …

Drukpadam

Leave a Comment