Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నాడు ఇందిరాకు.. నేడు సోనియా, రాహుల్ లకు దేశ ప్రజల అండ: సీఎల్పీ నేత భట్టి!

నాడు ఇందిరాకు.. నేడు సోనియా, రాహుల్ లకు దేశ ప్రజల అండ: సీఎల్పీ నేత భట్టి!
-రాజకీయంగా ఎదుర్కొనలేక ఈ.డి, ఐ.టీలతో కేంద్రం దాడులు
-దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబ వారసులు భయపడతారా..?:
-రాహుల్ ను మళ్లీ విచారణకు పిలవడం పై భట్టి ఆధ్వర్యంలో నిరసన
-ఖమ్మం ధర్నా చౌక్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

నాడు స్వర్గీయ ప్రధాని ఇందిర గాంధీకి దేశ ప్రజలు అండగా నిలిచినట్లే.. నేడు సోనియా రాహుల్ గాంధీలను ఈ.డీ నోటీసుల పేరిట వేధిస్తున్న బీజేపీ కుట్రలను తిప్పి కొట్టడానికి దేశ ప్రజలు అండగా ఉంటారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని మంగళవారం విచారణ పేరిట రెండవ రోజు ఈ.డి కార్యాలయానికి పిలిచిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగకుండా పోరాటం చేస్తున్న సోనియా, రాహుల్ గాంధీలను రాజకీయంగా ఎదుర్కోలేని బిజెపి అక్రమంగా ఈ.డి తో కేసులు బనాయించారని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి జాతి సంపదను కాంగ్రెస్ సృష్టిస్తే… మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం జాతి సంపదను కార్పొరేట్ శక్తులైన అంబానీ, ఆదానీలకు దారాదత్తం చేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ చర్యలను వ్యతిరేకించిన రాహుల్ గాంధీపై కక్ష్య పూరితంగా కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లో ఆరెస్సెస్ భావజాలం కలిగిన అధికారిని నియమించి, మూసివేసిన కేసును తిరిగి ఓపెన్ చేశారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, ఈడీ లాంటి సంస్థలను రాజకీయ లబ్ధి కోసం వాడటం దుర్మార్గమని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్ష నాయకుల పై కేంద్రంలోని బిజెపి సర్కార్ ఈ.డీ ,ఐ.టీ లతో దాడులు చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో బిజెపి కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ సోనియా, రాహుల్ గాంధీలను రాజకీయంగా ఎదుర్కోలేక E. D తో నోటీసులు ఇప్పించిందని మండిపడ్డారు. 1978 నవంబర్ లో ఇందిరా గాంధీ లోక్ సభకు ఎన్నికైతే అప్పటి అధికారంలో ఉన్న జనతా పార్టీ ఇందిరా గాంధీ పట్ల కక్షపూరితంగా వ్యవహరించి కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్ పేరిట లోక్ సభ నుండి ఎక్స్ పైర్ చేశారని తెలిపారు. అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపితే దేశం మొత్తం తిరగబడి ఇందిరాగాంధీకి అండగా నిలబడిందన్నారు. 1980లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని 350 సీట్లతో గెలిపించి ఇందిరా గాంధీని ప్రధానిని చేశారని, ఇప్పుడు అదే రీతిలో
సోనియా, రాహుల్ పట్ల బిజెపి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టే దేశ ప్రజలు సోనియా, రాహుల్ కు అండగా ఉంటారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ తో దేశంలో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

దేశ స్వాతంత్య్రం కోసం మోతిలాల్ నెహ్రు స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పేపర్ పై కుట్ర పూరితంగా కేసు నమోదు చేసి సోనియా, రాహుల్ గాంధీలకు ఈ.డి నోటీసులు ఇప్పిస్తే… దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిర, రాజీవ్ గాంధీ వారసులు భయపడతారా అని ప్రశ్నించారు. మీరు భయపెడితే.. ఇక్కడ ఎవరు బయపడరన్న విషయాన్ని బీజేపీ పాలకులు గ్రహించాలని హెచ్చరించారు. దేశం కోసం మోతిలాల్ నెహ్రూ ఢిల్లీ, అలహాబాద్ లో ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను దేశానికి రాసిచ్చారని, దేశ సమైక్యత సమగ్రత కోసం ఇందిర, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను త్యాగం చేశారుని ఇలాంటి కుటుంబానికి E.D నోటీసులు ఇస్తే భయపడతారని బిజెపి భావించడం అవివేకమన్నారు. చరిత్రను తెలుసుకోకుండ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, గత చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. మత విద్వేషాలను రెచ్చ గొట్టి, మత విధ్వంసాలు సృష్టిస్తూ, ఆర్థిక అరాచకాలకు పాల్పడుతున్న బీజేపీని దేశం నుంచి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని భట్టి హెచ్చరించారు .

Related posts

Smartphone Separation Anxiety: Scientists Explain Why You Feel Bad

Drukpadam

ఖమ్మంలో బంద్ ను పర్వేవేక్షించిన కమీషనర్ ఆఫ్ పోలీసు

Drukpadam

తనపై ఎన్టీఆర్ మనిషిగా ముద్ర.. అందుకు గర్విస్తున్నా …చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

Drukpadam

Leave a Comment