తెలుగుదేశం డేరింగ్ స్టెప్ …ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులపై వేటు …!
-ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులను పదవుల నుంచి తొలగించిన టీడీపీ
-కడప జిల్లాకు చెందిన సాయినాథ్ శర్మ, వెంకటసుబ్బారెడ్డిలపై వేటు
-పార్టీ ఇన్చార్జీలతో విభేదించి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణ
-విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో చర్యలు
-పదవుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీలో క్రమశిక్షణ తప్పినవారిపై కొరడా ఝుళిపిస్తుంది.రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను చావో రేవోగా భావిస్తున్న టీడీపీ తీసుకుంటున్న చర్యలపై చర్చ జరుగుతుంది.అమరావతి రాజధాని , మూడురాజధానులు పై ఇప్పటికే రాష్ట్రంలో తీవ్రస్థాయిలో రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ చర్యలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయని కొందరు రాజకీయపరిశీలకుల అభిప్రాయం.తాము తప్పకుండ ఈసారి అధికారంలోకి వస్తామని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. జగన్ పాలనపై ప్రజలు విసుగు చెందారని అందువల్ల ప్రత్యాన్మాయంగా తామే ఉన్నందున అధికారం తమకు కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. అందువల్ల చర్యలకు సైతం వెనకాడటంలేదని ఒక కలర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది.
అందులో భాగంగానే తెలుగు దేశం పార్టీ మంగళవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్యదర్శులుగా కొనసాగుతున్న ఇద్దరు నేతలను ఆ పదవుల నుంచి తొలగించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పదవుల నుంచి తొలగింపునకు గురైన ఇద్దరు నేతలు కడప జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.
కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి చెందిన సాయినాథ్ శర్మ, మైదుకూరు నియోజకవర్గానికి చెందిన వెంకటసుబ్బారెడ్డిలు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. పార్టీ ఇన్చార్జీలతో విభేదించి మరీ వీరిద్దరూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన అధిష్ఠానం ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో వీరిద్దరినీ పార్టీ రాష్ట్ర కార్యదర్శుల పదవుల నుంచి తొలగిస్తూ అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.