Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

పాకిస్థాన్‌లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిందా మృతి!

పాకిస్థాన్‌లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిందా మృతి!

  • కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో మృతి చెందాడంటున్న పంజాబ్ పోలీసు వర్గాలు
  • తాము కాల్చి చంపామంటున్న పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ గ్రూప్
  • పలు ఉగ్రవాద కేసుల్లో నిందితుడిగా హర్విందర్
  • 2008లో నేర ప్రపంచంలోకి అడుగు

పలు ఉగ్రవాద కేసులతో సంబంధం ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిందా పాకిస్థాన్‌లో మృతి చెందినట్టు పంజాబ్ పోలీసు వర్గాలు తెలిపాయి. హర్విందర్‌ను తాము కాల్చి చంపామని గ్యాంగ్‌స్టర్ గ్రూప్ దావిందర్ భాంబిహా ప్రకటించుకుంది. ఈ ఏడాది మేలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్‌పీజీ) దాడిలో హర్విందర్ ప్రధాన సూత్రధారి. లుధియానా కోర్టులో పేలుడులోనూ ఆయన హస్తం ఉంది. పంజాబ్‌కు చెందిన పాప్యులర్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ హర్విందర్ పేరు చక్కర్లు కొట్టింది. పలు ఉగ్రవాద కేసులతో సంబంధం ఉన్న హర్విందర్.. నిషేధిత ఖలిస్థానీ గ్రూప్ బబ్బార్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడు.

హర్విందర్‌ను కాల్చి చంపామని గ్యాంగ్‌స్టర్ గ్రూప్ ప్రకటించినప్పటికీ పంజాబ్ పోలీసు వర్గాలు మాత్రం మరోలా చెబుతున్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న హర్విందర్ 15 రోజుల క్రితం లాహోర్ ఆసుపత్రిలో చేరాడని, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని చెబుతున్నారు. కాగా, రిందా తలపై జాతీయ దర్యాప్తు సంస్థ రూ. 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.

భారత జాతీయ భద్రతకు ముప్పుగా వాటిల్లిన హర్విందర్‌కు గ్యాంగ్‌స్టర్లు, పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి. డ్రగ్స్, ఆయుధాలు వంటివి స్మగ్లింగ్ చేయడంలోనూ దిట్ట. హర్యానాలో ఈ ఏడాది మేలో ఓ వాహనం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లిన కేసులోనూ రిందాపై చార్జ్‌షీట్ దాఖలైంది. 2008లో అతడు నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు.

Related posts

డొమినికా లో చౌక్సీ పేరు రాజ్ అని చెప్పుకున్నాడు… ‘మిస్టరీ ఉమన్’బార్బరా జబారికా

Drukpadam

అత్యాచారాలు పెరిగిపోతుండడంతో పాక్ లోని పంజాబ్ లో ఎమర్జెన్సీ!

Drukpadam

ఈసారి రివర్స్… చైనా గగనతలంలో అమెరికా బెలూన్లు!

Drukpadam

Leave a Comment