Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల ఎత్తులు …ఖమ్మం లెక్కలు!

రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల ఎత్తులు …ఖమ్మం లెక్కలు!
-టీఆర్ యస్ లెఫ్ట్ పొత్తులపై క్లారిటీ ఉన్నట్లేనా …?
-కాంగ్రెస్ ఒంటరి పోరాటమా ? షర్మిలతో పొత్తు ఉంటుందా ??
-బీజేపీ లో చేరే నాయకులు ఎవరు ?
-ఉమ్మడి జిల్లాలో లెఫ్ట్ పార్టీలు గురిపెట్టిన సీట్లు …

రాష్ట్ర శాసనసభకు మరో 10 నెలలే గడువు …దీంతో పార్టీలన్నీ రాజకీయాల పొత్తులు ,ఎత్తుల్లో మునిగిపోయాయి. పొత్తులపై ఇంకా స్పష్టత రానప్పటికీ ఏపార్టీ ,ఏపార్టీతో పొత్తు పెట్టుకుంటుంది.ఎవరి ప్రయాణం ఎవరితో ఉంటుంది అనేదానిపై రాజకీయపార్టీలు తలమునకలైయ్యాయి. ప్రత్యేకంగా ఖమ్మం ,నల్గొండ జిల్లలో కొంత బలంగా ఉంది ఓటర్లను ప్రభావితం చేయకలిగే శక్తి ఉన్న లెఫ్ట్ పార్టీలతో టీఆర్ యస్ పొత్తు ఎలా ఉంటుంది అనేది నేడు ఆసక్తిగా మారింది.మునుగోడు ఉపఎన్నికల అనంతరం పొత్తుల ,ఎత్తుల వ్యవహారం పై చర్చోప చర్చలకు దారి తీస్తుంది .

తెలంగాణ రాష్ట్ర శాశనసభకు వచ్చే ఏడాది అక్టోబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. 119 స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఏ కూటమి 60 స్థానాలు గెలుస్తుందో అది అధికారంలోకి వస్తుంది. అధికారం కోసం టీఆర్ యస్ తో పాటు కాంగ్రెస్ , బీజేపీ లు పోటీపడుతున్నాయి . కాంగ్రెస్ పని అయిపోయింది టీఆర్ యస్ కు మేమే ప్రత్యాన్మాయం అంటుంది బీజేపీ .అందుకు గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు ,దుబ్బాక , హుజారాబాద్ లో బీజేపీ గెలుపును ఉదాహరణగా చూపిస్తున్నారు .మునుగోడులో కూడా నైతిక విజయం తమదే అని అంటున్నారు . దీనికి తోడు కాంగ్రెస్ తో పాటు టీఆర్ యస్ లో ఉన్న అసమ్మతి నాయకులకు గాలం వేస్తున్నారు . ఆక్రమంలోనే ఉమ్మడి ఖమ్మం,నల్లగొండ జిల్లాలోని అధికార టీఆర్ యస్ అసమ్మతి నాయకులపై వత్తిడి తెస్తున్నారు .

అధికార టీఆర్ యస్ పార్టీ ముచ్చట మూడవసారి అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.మునుగోడు గెలుపులో తమకు కీలక మద్దతు ఇచ్చిన వామపక్ష పార్టీలను ఈసారి ఎన్నికల్లో కలుపుకొని పోవాలని ఆలోచన చేస్తున్నారు . లెఫ్ట్ పార్టీలు కూడా టీఆర్ యస్ తో కలిసి ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి . మరి సీట్ల సంగతే ఇక్కడ చిక్కుగా ఉంది.

ఖమ్మం జిల్లాలో సిపిఐ ఇప్పటికే తాము పోటీ చేయాలనుకున్న సీట్లను ప్రకటించింది. అందులో కొత్తగూడెం ,పినపాక , వైరా , భద్రాచలం ,పాలేరు ఉండగా సిపిఎం పాలేరు , మధిర, భద్రాచలం , వైరా నియోజకవర్గాలలో పోటీచేయాలని యోచనలో ఉన్నట్లు సమాచారం .రెండు పార్టీలు పాలేరు , భద్రాచలం , వైరా నియోజకవర్గాలు ఉండటం విశేషం . టీఆర్ యస్ కూడా లెఫ్ట్ పొత్తు పెట్టుకోవాలని అనుకున్నా వారు అడిగినన్ని సీట్లు ఇవ్వడం కుదరక పోవచ్చు …అయితే సిపిఐ కొత్తగూడెం , సిపిఎం పాలేరు పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే టీఆర్ యస్ కు సిట్టింగ్ సీట్లు అయినందున వాటిని ఇచ్చేందుకు టీఆర్ యస్ అంగీకరిస్తుందా ? లేదా అనే చర్చ జరుగుతుంది. ఈ రెండు సీట్లపై టీఆర్ యస్ లో కూడా పోటీ ఉంది …పాలేరులో తాజా ఎమ్మెల్యే కందాల తనపోటి ఖాయమని అంటుండగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈసారి పాలేరులో ఎర్రజెండా ఎగురుతుంది ధీమా వ్యక్తం చేస్తున్నారు . కొత్తగూడెం లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు టీఆర్ యస్ పొత్తుతో పోటీచేస్తారని అంటుండగా , సిట్టింగ్ సీటు అయినందున తమకే వస్తుందని వనమా వెంకటేశ్వరరావు అంటున్నారు. దీనిపై గులాబీ బాస్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి లెఫ్ట్ పార్టీల పొత్తులు ఉంటాయి. నల్గొండలో కూడా అదే పరిస్థితి. నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ , నకిరేకల్ , తుంగతుర్తి , మునుగోడు , దేవరకొండ,లాంటి నియోజకవర్గాలపై కమ్యూనిస్టులు కన్నేశారు . రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీం పట్నం , కరీంనగర్ లో హుస్నాబాద్ , వరంగల్ లో జనగాం లాంటి మరికొన్ని నియోజకవర్గాలను కమ్యూనిస్టులు పట్టుబట్టనున్నారు .

బీజేపీ ఇతర పార్టీలనుంచి పెద్ద పలుకుబడి ఉన్న నాయకులను నాయన భయానా తమపార్టీలో చేర్చుకోవడం ద్వారా అధికారంలోకి రావాలని ఎత్తులు వేస్తుంది. అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన 60 సీట్లు రాకపోయినా , 25 నుంచి 30 సీట్లు వస్తే అధికారం తమదే అంటున్నారు . అందుకోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని పేర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి , మాజీమంత్రి తుమ్మల, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు లపై బీజేపీ బాగా వత్తిడి తెస్తున్నట్లు సమాచారం .టీఆర్ యస్ తమకు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి నిర్ణయం తీసుకోవాలని వారు భావిస్తున్నారని తెలుస్తుంది.

ఇక కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి ప్రజల్లో పలుకుబడి ఉన్నా, నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం , పార్టీ నుంచి పలువురు సీనియర్లు వెళ్లి పోవడం , ఉన్నవాళ్ల మధ్య పొసగక పోవడం ఇబ్బంది కరంగా మారింది.
కాంగ్రెస్ తో పొత్తుకు లెఫ్ట్ పార్టీలు సిద్ధంగా లేవు …ఇక ఉన్న ఒకే ఒక్క ఆశ షర్మిల నాయకత్వంలోని వైయస్సార్ తెలంగాణ పార్టీ . షర్మిల పార్టీ తో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి కాంగ్రెస్ మద్దతుతో షర్మిల పోటీ చేస్తారని అంటున్నారు . షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా పాలేరు నుంచి అసెంబ్లీకి పోటీచేయనున్నట్లు ప్రకటించారు .  తెలుగుదేశం ,బీఎస్పీ ,ఎంఐఎం లాంటి పార్టీల ప్రభావం గెలుపోటములపై ఉంటాయి  . దీంతో తెలంగాణ    రాజకీయాలు రసవత్తరంగా మారె అవకాశాలు ఉన్నాయి…. చూద్దాం ఏమి జరుగుతుందో ….!

Related posts

కోమటిరెడ్డి లో మార్పు రావడం సంతోషకరం …విహెచ్ ..

Drukpadam

మోడీకి మమతాబెనర్జీ గుడ్ సర్టిఫికెట్ …

Drukpadam

లక్షల మందికి ఉద్యోగ ద్వారాలు తెరుస్తున్న కెనడా!

Drukpadam

Leave a Comment