Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ పొత్తుకోసమే చంద్రబాబు డ్రామాలు …మంత్రి హరీశ్ రావు….

బీజేపీ పొత్తుకోసమే చంద్రబాబు డ్రామాలు …మంత్రి హరీశ్ రావు….
-టీడీపీ నేత పర్యటనలపై టీఆర్ యస్ , వైసీపీ ఎడాపెడా వాయింపులు ….
-ఖమ్మం సభలో చంద్రబాబు వ్యాఖ్యలపై హరీశ్ రావు కౌంటర్
-చంద్రబాబును ఏపీ ప్రజలు ఛీత్కరించారని విమర్శలు
-బాబు పాలనలోనే తెలంగాణ అత్యధిక నిర్లక్ష్యానికి గురైందని వెల్లడి
-బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు: సజ్జల

 

ఖమ్మంలో జరిగిన టీడీపీ శంఖారావం సభలో చంద్రబాబు ప్రసంగంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖమ్మంలో చేసిన షో ఎలా ఉందంటే… కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టు ఉందని విమర్శించారు. ఏపీని అప్పులపాలు చేసి, అభివృద్ధి చేయలేక, ప్రజల ఛీత్కారానికి గురై, ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేస్తానంటున్నాడని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే చిత్తుచిత్తుగా ఓడించి వెళ్లగొడితే, ఇక్కడికొచ్చి ఏదో చేస్తానంటున్నాడని హరీశ్ రావు పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అత్యధికంగా దోపిడీకి గురైందంటే, అత్యధిక నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు 9 ఏళ్ల పాలనలోనే జరిగిందని వెల్లడించారు. తెలంగాణలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.

“మాకు ఉద్యోగాలు కావాలని, మా పల్లెలు అభివృద్ధి కావాలని తెలంగాణ యువత అడిగితే వారిని నక్సలైట్లు పేరిట కాల్చి చంపింది చంద్రబాబు నాయుడు గారే… ఆ విషయం మర్చిపోయారా? ఈ విషయాన్ని తెలంగాణ సమాజం, యువత మర్చిపోలేదు. ఉద్యోగులనేమో గుర్రాలతో తొక్కించావు. అన్నీ తానే చేశానని చంద్రబాబు చెప్పుకుంటారు. బిల్ గేట్స్ వచ్చినప్పుడు, వరల్డ్ బ్యాంకు వాళ్లు వచ్చినప్పుడు ఏ విధంగా చెప్పారో అందరికీ తెలుసు. మా దేశంలో ఈ విధంగా చెబితే జైల్లో వేస్తామని కూడా ఒకాయన అన్నారు.

నేను అది చేశాను, ఇది చేశాను అని మీరు (చంద్రబాబు) ఏమైనా చెప్పగలరు. చంద్రబాబు స్టయిల్ ఎలా ఉంటుందంటే… ఇవాళ తెల్లవారుతుందంటే అది తన వల్లే అంటాడు, పొద్దునే కోడి కూస్తోందంటే అది తన వల్లే అంటాడు. నల్గొండలో ఫ్లోరోసిస్ తానే పారదోలానని చంద్రబాబు చెబుతున్నాడు… ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుందా? నల్గొండ వెళ్లి అడుగుదాం పదండి… ఫ్లోరోసిస్ పారదోలింది ఎవరో ప్రజలు చెబుతారు. ఫ్లోరోసిస్ నుంచి నిజంగా విముక్తి కలిగించింది కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమే. మీరంతా ఓట్ల కోసమే ఫ్లోరోసిస్ అంశాన్ని ఉపయోగించుకున్నారు.

రైతులకు అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటున్నారు… మరి మీ హయాంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? చంద్రబాబు పాలనలోనే అత్యధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. రైతులు ఉచిత విద్యుత్ ఇవ్వాలని హైదరాబాదుకు వస్తే బషీర్ బాగ్ చౌరస్తాలో వారిని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిన చరిత్ర నీది. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని రైతులను అవహేళన చేసిన చరిత్ర నీది. మీరా రైతుల గురించి మాట్లాడేది?

రైతులకు కేసీఆర్ చేసినట్టు ఇంకెవరైనా చేశారా? రైతులకు 9 విడతల్లో రూ.57 వేల కోట్ల రైతుబంధు సాయం అందించింది కేసీఆర్… దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.5 వేల కోట్లతో రైతు బీమా ఇచ్చింది కేసీఆర్… నీటి తీరువా బకాయిలు రద్దు చేసి ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్… రైతుల ట్రాక్టర్లకు పన్నులు రద్దు చేసి, రూ.550 కోట్ల పాత బకాయిలు రద్దు చేసింది కేసీఆర్… చంద్రబాబు హయాంలో నాశనం చేసిన చెరువులు, కాలువలను మిషన్ కాకతీయ పేరుతో పునరుద్ధరించింది కేసీఆర్… కల్వకుర్తి, మహబూబ్ నగర్ ను చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తే, ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్.

ఎన్ని చెప్పాలి బాబూ నీ గురించి? నీవన్నీ మాటలే… మావి చేతలు. 2004లో ఓడిపోయినప్పుడు తాము రైతులకు అన్యాయం చేసినందుకు ఓడిపోయామని లెంపలు వేసుకున్నది చంద్రబాబు కాదా. వ్యవసాయం దండగ, ఐటీ ముద్దు అన్నది మీరు కాదా… ఐటీలోనూ మీరు చేసిందేమీ లేదు.

2018లో మహాకూటమి పేరిట కుట్ర చేసే ప్రయత్నం చేశావు… కానీ తెలంగాణ ప్రజలు ఏకమై ఆ కుట్రను చిత్తు చేశారు. ఇవాళ కూడా నీ కుట్ర ఏంటో అందరికీ తెలుసు. ఆంధ్రాలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్నదే నీ ఎత్తుగడ. నాకు ఇక్కడ (తెలంగాణ) కూడా బలం ఉందని నిరూపించుకోవాలని ఆ ఖమ్మం సరిహద్దుల్లో సభ పెట్టుకుని పక్క రాష్ట్రం నుంచి ప్రజలను తెచ్చుకున్నావు. బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నావు తప్ప మాకేం నష్టం లేదు.

పోయినసారి నువ్వు మహాకూటమి పెడితే నీ దెబ్బకు ఆ కూటమి ఖతం అయిపోయింది. నిజానికి నీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటే భస్మమే. నీది భస్మాసుర హస్తం. నీ ప్రయత్నాలన్నీ బీజేపీతో పొత్తు కోసమేనని అర్థమైంది. నువ్వు ఏంచేసినా తెలంగాణలో చెల్లదు… వెళ్లి ఆంధ్రాలో ఏదైనా పని చేసుకుంటే నాలుగు ఓట్లైనా పడతాయి. ఆంధ్రాలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా? అందులోనూ తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తివి నువ్వు ఇక్కడికొచ్చి ఎలా మాట్లాడతావు?

ఇక ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడడం చూస్తుంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడమే. ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కాదు. ఎన్టీఆర్ ను చంద్రబాబు ఏంచేశాడో ప్రజలకు తెలియదా? ఏదేమైనా చంద్రబాబును తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు… ఉద్యమ సమయంలో ఆయన ఏంచేశాడో తెలియదా? ఎప్పుడు ఏ ఎండకు ఏ గొడుగు ఎలా పడతాడో అందరికీ తెలుసు” అంటూ హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు: సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఖమ్మంలో భారీ బహిరంగసభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టే చంద్రబాబు తెలంగాణ యాత్రలను ప్రారంభించారని చెప్పారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతన్ని గతంలోనే ప్రజలు తిరస్కరించారని అన్నారు. చంద్రబాబుకు ఏ విషయంలో కూడా క్లారిటీ లేదని చెప్పారు.

బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని సజ్జల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా పనికట్టుకుని ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పల్నాడులో వైసీపీ బలంగా ఉందని చెప్పారు. విద్యా రంగంలో డిజిటల్ విప్లవానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు.

Related posts

కార్యకర్తలపై బొత్స గుస్సా …ఉంటె ఉండండి పొతే పోండి అంటూ అసహనం!

Drukpadam

చంద్రబాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఈసీని కోరిన వైసీపీ నేత

Drukpadam

బీఆర్ యస్, బీజేపీ బంధువుల పార్టీ…ఖమ్మం భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ..!

Drukpadam

Leave a Comment