కోహ్లీ ఇకనైనా అహాన్ని వీడాలి: కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు!
- అప్పుడే అతడికి, జట్టుకు మంచిది
- కొత్త కెప్టెన్ కు మార్గదర్శనం చేయాలి
- బ్యాటర్ గా కోహ్లీని వదులుకోలేమని వ్యాఖ్య
- కెప్టెన్సీని వదులుకోవడాన్ని స్వాగతించిన దిగ్గజం
విరాట్ కోహ్లీ తన అహాన్ని తగ్గించుకోవాలని టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సూచించారు. ఇటీవలే టెస్ట్ కెప్టెన్ గా తప్పుకొంటున్నట్టు కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని ఫార్మాట్లలోనూ వేరే కెప్టెన్ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే కపిల్ దేవ్ స్పందించారు.
కొత్త కెప్టెన్ కింద ఆడబోతున్న కోహ్లీ.. తనలోని అహాన్ని ఇకనైనా వీడాలంటూ పేర్కొన్నారు. కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ప్రస్తుతం కోహ్లీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడని, అతడిపై ఎంతో ఒత్తిడి ఉండి ఉంటుందని అన్నారు. కొత్త కెప్టెన్ కింద ఆడబోతున్న నేపథ్యంలో కోహ్లీ తన మాటలను కాస్త అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు.
‘‘నేను గవాస్కర్ కెప్టెన్సీలో ఆడాను. కె.శ్రీకాంత్, మహ్మద్ అజారుద్దీన్ కింద కూడా ఆడాను. అప్పట్లో నాకు ఎలాంటి ఈగోలూ లేవు. కోహ్లీ కూడా అహాన్ని వీడాలి’’ అని చెప్పారు. దాని వల్ల కోహ్లీతో పాటు జట్టుకు కూడా మంచి జరుగుతుందన్నారు. కొత్త కెప్టెన్, కొత్త ఆటగాళ్లకు అతడు మార్గదర్శనం చేయాలని సూచించారు. బ్యాట్స్ మన్ పరంగా చూస్తే కోహ్లీని ఎవరూ వదులుకోలేరని, ఆ చాన్సే లేదని కపిల్ తేల్చి చెప్పారు.
- 19 నుంచి వన్డే సిరీస్ మొదలు
- 23న చివరి వన్డే మ్యాచ్
- సారథిగా కాకుండా బరిలోకి దిగుతున్న కోహ్లీ
- కెప్టెన్ గా బాధ్యతలు మోయనున్న రాహుల్

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ లో ఓటమి చూసిన టీమిండియా బుధవారం నుంచి ఆరంభమయ్యే వన్డే సిరీస్ లో ఏ మేరకు రాణిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ టెస్ట్ జట్టు సారథ్య బాధ్యతలను విడిచిపెట్టిన తర్వాత ఆడబోయే మొదటి మ్యాచ్ అవుతుందిది. జట్టులో ఒక సాధారణ ప్లేయర్ గా (కెప్టెన్ గా కాకుండా) ఏడేళ్ల తర్వాత కోహ్లీ ఆడుతుండడమే విశేషం.
మరోపక్క, రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. దీంతో ఓపెనర్ కేఎల్ రాహుల్ కు జట్టును నడిపించే చక్కని అవకాశం లభించింది. దీన్ని రాహుల్ సద్వినియోగం చేసుకుంటాడా? అన్నది మరో ఆసక్తికర అంశం. ఈ విషయంలో కోహ్లీ సూచనలను తప్పకుండా తీసుకునే అవకాశం ఉంది. వన్డే సిరీస్ ను గెలుచుకుంటే కనుక అది రాహుల్ కు పెద్ద ప్లస్ అవుతుంది. మున్ముందు మంచి అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది.
కోహ్లీని ఎప్పటికీ నాయకుడిగానే జస్ప్రీత్ బుమ్రా అభివర్ణించడం గమనార్హం. దీంతో కేఎల్ రాహుల్ కు కోహ్లీ ఏ మేరకు సూచనలు ఇస్తాడు, బ్యాట్ తో ఏ మేరకు రాణిస్తాడో చూడాల్సి ఉంది. సారథిగా కానప్పుడు సెలక్టర్లు చూసేది ఆటగాడి ప్రదర్శననే. కనుక బ్యాటింగ్ తో రాణించడం కోహ్లీకి ప్రతిష్ఠాత్మకం అవుతుంది. అసలే బీసీసీఐతో కోహ్లీకి సంబంధాలు బలహీనపడ్డాయన్న ప్రచారం నడుస్తోంది. కనుక ఇద్దరు ఆటగాళ్ల ప్రతిభకు, భారత జట్టు రాణింపునకు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కీలకంగా నిలవనుంది. 19న తొలి వన్డే, 21న రెండో వన్డే, 23న చివరి వన్డే మ్యాచ్ జరగనున్నాయి.