మేడారం జాతర సమీక్షలో గాయత్రి రవి!
– కమిటీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం
– మంత్రులతో కలిసి ఏర్పాట్ల పరిశీలన
సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై శనివారం మేడారంలో ఉన్నత స్థాయి మంత్రులు, అధికారుల సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి లతో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు సుదీర్ఘంగా సమీక్షించారు. సమీక్షా సమావేశం కోసం హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్, డిజీపీలకు గాయత్రి రవి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అధికారులు, మంత్రులతో కలిసి ఏర్పాట్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు.
అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో మేడారం జాతర శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ అధికారులు గాయత్రి రవితో అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యేలు సీతక్క, గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.