సీఎం గారూ… రేపటి మీ ఢిల్లీ యాత్ర దేనికి స్వామి :వర్ల
– స్వామి కార్యమా? స్వకార్యమా? చెప్పండి
-రేపు ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన
-కేంద్రమంత్రులను కలిసే అవకాశం
-తనదైన శైలిలో స్పందించిన వర్ల
-సీఎం ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో చెప్పాలంటూ ట్వీట్
ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. పలు అంశాలపై ఆయన అమిత్ షా తదితర కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. అయితే, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తనదైన శైలిలో స్పందించారు. సీఎం గారూ… రేపటి మీ ఢిల్లీ యాత్ర స్వామి కార్యమా లేక స్వకార్యమా? అని ప్రశ్నించారు.
స్వామి కార్యం అంటే ప్రజల కోసం అని, స్వకార్యం అంటే కేసుల మాఫీ కోసం, బెయిల్ రద్దు కాకుండా చూసుకోవడం కోసం, ఎంపీ రఘరామ కేసులో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం, ఆయన ఫోన్ కు సంబంధించిన వ్యవహారంలో సీఐడీ అధికారులను రక్షించడం కోసం, థర్డ్ డిగ్రీ అధికారులను కాపాడడం కోసం అని భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటిలో ఏది నిజం అని వర్ల ప్రశ్నించారు. మీ ఢిల్లీ యాత్ర అందుకేనా అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు కరోనా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వ్యాక్సిన్ అందించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు.