Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 26 June 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం కేసు : హైకోర్టులో విచారణ వాయిదా

  • కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన రేవంత్
  • లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై వ్యాఖ్యల వివాదం
  • పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాజకీయ ప్రసంగమేనన్న న్యాయవాది
  • తదుపరి విచారణను జూలై 2కు వాయిదా వేసిన హైకోర్టు

ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జూలై 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. గత లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్‌రెడ్డి బీజేపీ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వాసం వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధుల కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, కింది కోర్టులో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రసంగించారని, అది కేవలం రాజకీయపరమైన ప్రసంగం మాత్రమేనని కోర్టుకు తెలిపారు. ఈ వ్యాఖ్యలను వ్యక్తిగత దూషణగా పరిగణించరాదని, అందువల్ల ఈ కేసును కొట్టివేయాలని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను జూలై 2వ తేదీకి వాయిదా వేసింది.