Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 18 August 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

స్టాలిన్‌ను మళ్లీ సీఎం కానివ్వను: శశికళ శపథం…

  • వచ్చే ఎన్నికల్లో డీఎంకేను గెలవనివ్వనన్న శశికళ
  • రాష్ట్ర పరిస్థితి చూసి నిద్ర పట్టడం లేదంటూ ఆవేదన
  • జయలలిత పాలన వేరు… ఇప్పటి పరిస్థితి వేరు అని వ్యాఖ్య

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి. ఏఐఏడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీని గెలవనివ్వబోనని, స్టాలిన్‌కు మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వనని ఆమె శపథం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుత పాలనపై శశికళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అమ్మ’ జయలలిత హయాంలో తమిళనాడు ఎంతో అభివృద్ధి సాధించిందని, కానీ నేటి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఆవేదన చెందారు. “ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నాకు రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. మేం ప్రజలకు మంచి పాలన అందించాం. అందుకే ఇప్పటి పరిస్థితులు చూస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మాకే తెలుసు. స్టాలిన్, మిమ్మల్ని మరోసారి అధికారంలోకి రానివ్వను” అని ఆమె స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, గత ఏఐఏడీఎంకే ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని కూడా శశికళ తప్పుపట్టారు. పారిశుద్ధ్య కార్మికుల వ్యవస్థను ప్రైవేటీకరించడం సరైన చర్య కాదని ఆమె విమర్శించారు. జయలలిత జీవించి ఉంటే అలాంటి నిర్ణయానికి ఎప్పటికీ అంగీకరించేవారు కాదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అన్నీ ఆలోచించి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.