Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 19 August 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ఒకేసారి 8 గంటల నిద్ర కరెక్ట్ కాదా? చరిత్ర ఏం చెబుతోంది?

  • గతంలో రెండు విడతలుగా నిద్రపోయే అలవాటు
  • చీకటి పడ్డాక నిద్రించి, మధ్యరాత్రి ఒకసారి మేల్కోవడం
  • ఆ సమయంలో పనులు చేసుకుని మళ్లీ తెల్లవారుజాము వరకు నిద్రపోవడం 
  • పారిశ్రామిక విప్లవం తర్వాత మారిన నిద్ర అలవాట్లు
  • కృత్రిమ లైట్ల రాకతో ఒకేసారి నిద్రపోయే విధానం ప్రారంభం
  • ఆధునిక నిద్ర సమస్యలకు ఇదే కారణం కావొచ్చంటున్న పరిశోధనలు

ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట కనీసం 7 నుంచి 8 గంటల నిరంతరాయ నిద్ర అవసరమని మనం భావిస్తాం. కానీ కొన్ని శతాబ్దాల క్రితం మన పూర్వీకులు ఇలా ఒకేసారి నిద్రపోయేవారు కాదట. వారి నిద్రా విధానం మనకంటే పూర్తిగా భిన్నంగా ఉండేది. వాళ్లు రాత్రిని రెండు భాగాలుగా విభజించుకుని నిద్రపోయేవారు. ఈ పాత అలవాటు గురించి ‘హిస్టరీ సీజన్’ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఇటీవల ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

రెండు విడతల నిద్ర అంటే ఏమిటి?
వేల సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రెండు దశల నిద్ర విధానాన్ని అనుసరించేవారని ఆ పోస్ట్ వెల్లడించింది. సూర్యాస్తమయం తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో నిద్రకు ఉపక్రమించి, మూడు నాలుగు గంటల పాటు నిద్రపోయేవారు. అనంతరం మధ్యరాత్రి సమయంలో సహజంగానే మేల్కొని ఒకటి రెండు గంటల పాటు మెలకువగా ఉండేవారు.

ఈ సమయంలో పశువులకు మేత వేయడం, పుస్తకాలు చదవడం, ప్రార్థనలు చేసుకోవడం, కుట్టుపని వంటి పనులు చేసుకునేవారు. మరికొందరు తమ పడకపైనే కబుర్లు చెప్పుకునేవారు. చంద్రుడి వెలుతురు లేదా నూనె దీపాల కాంతిలో ఈ పనులన్నీ చక్కబెట్టుకుని, మళ్లీ నిద్రలోకి జారుకుని సూర్యోదయం వరకు విశ్రాంతి తీసుకునేవారు. ఈ విధానాన్ని ‘తొలి నిద్ర’, ‘మలి నిద్ర’ అని పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు.

అలవాటు ఎలా మారింది?
పారిశ్రామిక విప్లవం రావడంతో ఈ అలవాటు క్రమంగా కనుమరుగైంది. కృత్రిమ దీపాలు, వీధిలైట్లు అందుబాటులోకి రావడంతో రాత్రుళ్లు కూడా పగటిలా వెలుతురుతో నిండిపోయాయి. “రాత్రుళ్లు చీకటి తగ్గడంతో ప్రజలు ఆలస్యంగా నిద్రపోవడం ప్రారంభించారు. కానీ ఉదయాన్నే పనులకు మాత్రం త్వరగా లేవాల్సి వచ్చేది” అని ఆ పోస్ట్ వివరించింది. ఇదే సమయంలో, నిద్రపై సమాజం దృక్పథం కూడా మారింది. మధ్యలో మేల్కోవడాన్ని సోమరితనంగా చూడటం మొదలుపెట్టారు. దీంతో నిరంతరాయ నిద్రకే ప్రామాణికత లభించింది. 20వ శతాబ్దం నాటికి రెండు విడతల నిద్ర అనే భావన దాదాపుగా అదృశ్యమైంది.

చరిత్రకారుడు ఎ. రోజర్ ఎకిర్చ్ తన ‘ఎట్ డేస్ క్లోజ్: నైట్ ఇన్ టైమ్స్ పాస్ట్’ అనే పుస్తకంలో ఈ విషయంపై విస్తృతంగా రాశారు. 17వ శతాబ్దం చివరి నుంచి యూరప్‌లోని ఉన్నత వర్గాలలో ఈ మార్పు మొదలై, రాబోయే 200 ఏళ్లలో ప్రపంచమంతటా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. ఆధునిక జీవనశైలి, పనివేళల కారణంగా చాలామందికి ఇప్పుడు రెండు విడతల నిద్ర సాధ్యం కాకపోవచ్చు. అయితే, కొందరిలో నిద్రలేమి వంటి సమస్యలకు శరీర సహజసిద్ధమైన ఈ పాత అలవాటే కారణం కావొచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.