Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 17 September 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ఒకే ఇంట్లో 4,271 మంది ఓటర్లు.. ఉత్తరప్రదేశ్‌లో వింత!

  • యూపీ పంచాయతీ ఓటర్ల జాబితా సవరణలో బయటపడ్డ భారీ లోపం
  • మహోబా జిల్లా జైత్‌పూర్‌ మొత్తం ఓటర్లలో నాలుగో వంతు మందికి ఒకే చిరునామా 
  • సాంకేతిక తప్పిదమేనని, ఓటర్లు నిజమైనవారేనంటున్న అధికారులు
  • డేటా ఎంట్రీ సమయంలో మూడు వార్డుల ఓటర్లను ఒకే ఇంటికి ట్యాగ్ చేశారని వెల్లడి
  • ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంపై ప్రతిపక్షాలు, స్థానికుల తీవ్ర విమర్శలు

ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితాలో ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. మహోబా జిల్లాలోని ఒకే ఇంటి చిరునామాపై ఏకంగా 4,271 మంది ఓటర్లు ఉన్నట్లు తేలడంతో అధికారులు, స్థానికులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

2026లో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా జైత్‌పూర్ గ్రామ పంచాయతీలో విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఈ భారీ తప్పిదం బయటపడింది. ఆ గ్రామంలోని ఇంటి నంబర్ 803లో ఏకంగా 4,271 మంది ఓటర్లు నమోదయ్యారు. ఈ పంచాయతీ మొత్తం ఓటర్ల సంఖ్య 16,069 కాగా, అందులో దాదాపు నాలుగో వంతు ఓటర్లు ఒకే ఇంటి చిరునామాపై ఉండటం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇంటింటి సర్వే కోసం వెళ్లిన బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వో) ఈ విషయాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై సహాయ జిల్లా ఎన్నికల అధికారి ఆర్పీ విశ్వకర్మ స్పందిస్తూ, ఇది కేవలం సాంకేతిక లోపం వల్లే జరిగిందని తెలిపారు. “గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నంబర్ల నమోదులో స్పష్టత ఉండదు. డేటా ఎంట్రీ చేసే సమయంలో మూడు వార్డులకు చెందిన ఓటర్లందరినీ పొరపాటున ఒకే ఇంటి నంబర్‌కు జతచేశారు. ఓటర్లు నిజమైనవారే, కేవలం వారి చిరునామా మాత్రమే తప్పుగా నమోదైంది. దీనిని వెంటనే సరిదిద్దుతున్నాం” అని ఆయన వివరించారు. 2021లో కూడా ఇలాంటి పొరపాట్లు జరిగాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కున్వర్ పంకజ్ సింగ్ అంగీకరించారు.

ఇలాంటి తప్పిదాలు జైత్‌పూర్‌లోనే కాకుండా సమీపంలోని పన్వారీ పట్టణంలోనూ వెలుగు చూశాయి. అక్కడ ఒక ఇంటిపై 243 మంది, మరో ఇంటిపై 185 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఈ అంశాన్ని మొదట గుర్తించిన సామాజిక కార్యకర్త చౌదరి రవీంద్ర కుమార్ ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. “ఒకే ఇంట్లో అన్ని కులాల ప్రజలు వందల సంఖ్యలో ఓటర్లుగా ఉండటం వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది” అని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పదేపదే పునరావృతం కావడం ఎన్నికల పారదర్శకతపై అనుమానాలకు తావిస్తోందని ప్రతిపక్షాలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.