Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 17 September 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

బడిలో క్షుద్రపూజల కలకలం.. భయంతో విద్యార్థుల పరుగులు!

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపిన ఘటన
  • గణేశ్‌పాడు ప్రాథమిక పాఠశాల ముందు క్షుద్రపూజల ఆనవాళ్లు
  • పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో వింత ముగ్గులు

జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం రేగింది. బడి తలుపుల ముందు పసుపు, కుంకుమతో వేసి ఉన్న వింత ముగ్గులు, నిమ్మకాయలను చూసి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే, దమ్మపేట మండలం గణేశ్‌పాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు యథావిధిగా విద్యార్థులు చేరుకున్నారు. అయితే, పాఠశాల ప్రధాన ద్వారం వద్ద పసుపు, కుంకుమతో వేసిన ముగ్గులు, వాటి మధ్యలో నిమ్మకాయలు ఉండటాన్ని గమనించి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయపడిన చిన్నారులు తరగతి గదుల్లోకి వెళ్లకుండా వెనుదిరిగి ఇళ్లకు పరుగులు తీశారు.

పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురై పాఠశాల వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న గ్రామ పెద్దలు వెంటనే అక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. వారు పాఠశాల ముందున్న ముగ్గులను చెరిపివేసి, నీళ్లు చల్లి శుభ్రం చేశారు. అనంతరం పిల్లలకు ధైర్యం చెప్పి, వారిని క్లాసులకు పంపించారు.

పసిపిల్లలు చదువుకునే పవిత్రమైన విద్యాలయంలో ఇలాంటి పనులు చేయడం దారుణమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు.