Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 22 October 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

జీవికా దీదీలకు నెలకు రూ.30 వేలు.. తేజస్వి యాదవ్ భారీ హామీ!

  • బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కీలక హామీ
  • వారి ఉద్యోగాల పర్మినెంట్‌తో పాటు రుణమాఫీ చేస్తామని ప్రకటన
  • వడ్డీ లేని రుణాలు, రూ.5 లక్షల బీమా కల్పిస్తామన్న తేజస్వి

బీహార్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో, మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒక భారీ హామీని ప్రకటించారు. రాష్ట్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, స్వయం సహాయక బృందాల్లో పనిచేస్తున్న ‘జీవికా దీదీ’ కమ్యూనిటీ కార్యకర్తలకు ప్రతి నెలా రూ.30,000 గౌరవ వేతనం చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ హామీలతో మహిళా ఓటర్లలో కొత్త చర్చకు తెరలేపారు.

కేవలం వేతనం ఇవ్వడమే కాకుండా, వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని కూడా తేజస్వి హామీ ఇచ్చారు. జీవికా దీదీలు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో వారికి వడ్డీ లేని రుణాలు, రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. బీహార్‌లో దాదాపు 10 లక్షల మంది ఉన్న జీవికా దీదీలే లక్ష్యంగా ఆయన ఈ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వంపై తేజస్వి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయడాన్ని ఆయన ‘లంచం’గా అభివర్ణించారు. ఆ మొత్తం సాయం కాదని, రుణమని స్వయంగా కేంద్రమంత్రి అమిత్ షానే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఆ డబ్బును తిరిగి వసూలు చేస్తుందని ఆయన అన్నారు.

ఎవరీ జీవికా దీదీలు?

గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లక్ష్యంగా బీహార్ ప్రభుత్వం 2007లో ‘జీవిక’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసి మహిళలకు రుణాలు, శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పనిచేస్తున్న వారినే ‘జీవికా దీదీలు’ అని పిలుస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో వీరు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు.