Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 08 November 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

మా హయాంలో 88 వేలమందిని వెనక్కి పంపించాం: దిగ్విజయ్ సింగ్

  • పదకొండేళ్లలో ఎన్డీయే వెనక్కి పంపించింది 2,400 మందిని మాత్రమేనన్న దిగ్విజయ్ సింగ్
  • బీజేపీ తిప్పిపంపిన చొరబాటుదారులు 3 శాతం కూడా లేరన్న దిగ్విజయ్ సింగ్
  • అయినా పదేపదే చొరబాటుదారుల గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్య

యూపీఏ పదేళ్ల పాలనలో 88 వేల మంది చొరబాటుదారులను వెనక్కి పంపించామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. గత పదకొండేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం కేవలం 2,400 మందిని మాత్రమే గుర్తించిందని ఆయన తెలిపారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పదేపదే చొరబాటుదారుల అంశాన్ని లేవనెత్తుతోందని, అయితే వాస్తవానికి యూపీఏ హయాంలోనే ఎక్కువ మంది చొరబాటుదారులను తిప్పికొట్టామని ఆయన అన్నారు.

యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు గుర్తించిన సంఖ్యలో బీజేపీ హయాంలో గుర్తించింది మూడు శాతం కూడా లేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ బీజేపీ పదేపదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోందని విమర్శించారు. గతంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా ఎన్నికల సంఘం చూసుకునేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ప్రజలపైకి నెట్టిందని ఆయన విమర్శించారు. ఒకవేళ ఎవరైనా పౌరసత్వం నిరూపించుకోలేని పరిస్థితి ఉంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులకు ఇచ్చే ఓటరు లిస్ట్, పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల వద్ద ఉండే జాబితాలు భిన్నంగా ఉంటున్నాయని అన్నారు. దీని వల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రకటించిన వెంటనే ఓటర్ల జాబితాను స్తంభింపజేయాలని ఆయన సూచించారు.