Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 19 November 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

బంధుత్వం కలిపింది ఇద్దరినీ..తలసానిని కలిసిన కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్!

  • ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన నవీన్ యాదవ్
  • నేడు తలసానితో మర్యాదపూర్వక భేటీ
  • ఆశీస్సులు అందుకున్న యువ ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్ నియోజకవర్గ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాజీమంత్రి, బీఆర్ఎస్ సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికలో విజయం సాధించిన అనంతరం నవీన్ యాదవ్… తలసాని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. 

జూబ్లీహిల్స్‌లోని తలసాని నివాసానికి వెళ్లిన నవీన్ యాదవ్, ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. బంధుత్వరీత్యా నవీన్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అల్లుడు అవుతారు. నవీన్ యాదవ్… తలసాని సోదరుడి కుమార్తెను పెళ్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నేపథ్యంలో నవీన్ యాదవ్‌ను తలసాని అభినందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవల జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్… బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రస్థానానికి సీనియర్ నేత, కుటుంబ సభ్యుడు అయిన తలసాని ఆశీస్సులు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.