Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 23 November 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం.. జనసురాజ్ పార్టీ కమిటీలన్నీ రద్దు!

  • జనసురాజ్ పార్టీలో సంస్థాగత ప్రక్షాళన
  • రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ వరకు అన్ని కమిటీలు రద్దు
  • ఎన్నికల్లో ఓటమిపై సమీక్షకు సీనియర్ నేతలకు బాధ్యతలు
  • నెలన్నర రోజుల్లో కొత్త కమిటీల ఏర్పాటుకు నిర్ణయం
  • డిసెంబర్ 21న పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ఉన్న అన్ని సంస్థాగత కమిటీలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నెలన్నర రోజుల్లో కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

పాట్నాలో శనివారం జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనసురాజ్ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ మసిహుద్దీన్ తెలిపారు. పార్టీ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ గైర్హాజరీలో బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పార్టీ సమన్వయకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న కమిటీలు రద్దయినప్పటికీ, కొత్త కమిటీలు ఏర్పడే వరకు తమ విధులను కొనసాగిస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు 12 పరిపాలనా విభాగాలకు సీనియర్ నేతలను ఇంచార్జులుగా నియమించారు. క్రమశిక్షణా రాహిత్యం, పార్టీకి నష్టం కలిగించిన నేతలపై వీరు కేంద్ర నాయకత్వానికి నివేదిక సమర్పించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత అంశాలపై చర్చించేందుకు డిసెంబర్ 21న పాట్నాలో జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు మసిహుద్దీన్ వివరించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయిన విషయం తెలిసిందే. భవిష్యత్ ఎన్నికల కోసం బీహార్‌లో తన ప్రజా సంబంధాల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తానని ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే ప్రకటించారు.