Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 09 December 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

లోక్‌సభలో సహనం కోల్పోయిన రాజ్‌నాథ్ సింగ్..!

  • ‘వందేమాతరం’ చర్చలో ప్రతిపక్షాలపై మండిపడ్డ రాజ్‌నాథ్ సింగ్
  • నన్ను కూర్చోబెట్టేది ఎవరంటూ తీవ్ర ఆగ్రహం
  • కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే వందేమాతరానికి అన్యాయం జరిగిందన్న రక్షణ మంత్రి
  • ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల కోసం వాడుకుంటోందన్న ప్రియాంక గాంధీ

లోక్‌సభలో ‘వందేమాతరం’ గీతంపై జరిగిన చర్చ తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చర్చ సందర్భంగా తన ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగలడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నన్ను కూర్చోబెట్టేది ఎవరు? ఎవరు కూర్చోబెడతారు?” అంటూ వారిపై విరుచుకుపడ్డారు. “ఏం మాట్లాడుతున్నారు మీరు… కూర్చోండి!” అని గట్టిగా హెచ్చరించారు. స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని సభ్యులను శాంతపరచాల్సి వచ్చింది.

సోమవారం లోక్‌సభలో ‘వందేమాతరం’ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన బుజ్జగింపు రాజకీయాల కోసం జాతీయ గీతమైన ‘వందేమాతరం’ను ముక్కలు చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచే ఈ అన్యాయం మొదలైందని విమర్శించారు. వందేమాతరం గీతానికి జరిగిన అన్యాయం కేవలం ఒక పాటకు మాత్రమే కాదని, యావత్ స్వతంత్ర భారత ప్రజలకు జరిగిందని ఆయన అన్నారు.

అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోదీ ఈ చర్చను ప్రారంభిస్తూ వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకమని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ గీతం కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. వందేమాతరం వందేళ్లు పూర్తి చేసుకున్న సమయంలో కాంగ్రెస్ దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని అణచివేసిందని విమర్శించారు.

ఈ చర్చపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమే ఇదని ఆరోపించారు. నెహ్రూను విమర్శించడానికి సమయం కేటాయించడం మానేసి, ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించాలని ఆమె సూచించారు.