Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 11 December 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

అమిత్ షా నిన్న ఆందోళనగా కనిపించారు, చేతులు కూడా వణికాయి: రాహుల్ గాంధీ

  • అమిత్ షా నిన్న కంగారుగా కనిపించారన్న రాహుల్ గాంధీ
  • ఏ ప్రశ్నకూ నేరుగా సమాధానం చెప్పలేదని విమర్శ
  • నేను చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చిద్దామంటే సమాధానం రాలేదని వెల్లడి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న ఆందోళనగా కనిపించారని, ఆయన ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో జరిగిన చర్చలో అమిత్ షా నిన్న మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన ప్రసంగంపై ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అమిత్ షా నిన్న కంగారుగా కనిపించారని అన్నారు.

ప్రసంగం సమయంలో అమిత్ షా చేతులు కూడా వణుకుతూ కనిపించాయని, ఏ ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదని విమర్శించారు. తాను మాట్లాడిన వాటికి వేటికీ ఆధారం చూపించలేదని అన్నారు. మీడియా ముందు తాను చేసిన వ్యాఖ్యలన్నింటినీ పార్లమెంటులో చర్చిద్దామని ఆయనకు సవాల్ విసిరినప్పటికీ ఆయన నుంచి సమాధానం రాలేదని అన్నారు.

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి విమర్శలు

పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నప్పుడల్లా రాహుల్ గాంధీ బయటకు వెళ్లిపోతారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. రాహుల్ గాంధీ హిట్ అండ్ రన్ ఫార్ములాను అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనేమో అని చురక అంటించారు. భవిష్యత్తులో ఆయన తన అలవాటును మానుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.