Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 27 December 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

కిటకిటలాడుతున్న శబరిమల…

  • శబరిమల అయ్యప్పను ఇప్పటి వరకు 30లక్షల మంది దర్శించుకున్నారన్న అధికారులు
  • గత ఏడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య సుమారు రెండు లక్షలు తగ్గినట్లు వెల్లడి
  • నియంత్రణ చర్యలతో సజావుగా దర్శనాలు సాగుతున్నాయన్న అధికారులు

శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి ఈ సీజన్‌ ప్రారంభం నుంచే రద్దీ అధికంగా ఉండటంతో అధికారులు కఠిన నియంత్రణ చర్యలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు వర్చువల్‌ క్యూ, స్పాట్‌ బుకింగ్‌లపై పరిమితులు విధించి భక్తుల రద్దీని నియంత్రిస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే ఆదివారాల్లో రద్దీ కొంత తగ్గినట్లుగా భావిస్తున్నారు. 

తాజాగా ఆలయంలో భక్తుల రద్దీకి సంబంధించి వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 30 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు తెలిపారు. అయితే గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే భక్తుల సంఖ్య సుమారు రెండు లక్షలు తగ్గినట్లు వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్‌ 19న అత్యధికంగా 1.02 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా, డిసెంబర్‌ 12న అత్యల్పంగా 49 వేల మంది మాత్రమే ఆలయానికి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 

నిత్యం 80 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. మండలపూజ సందర్భంగా డిసెంబర్‌ 26, 27 తేదీల్లో వర్చువల్‌ క్యూ ద్వారా అనుమతించే భక్తుల సంఖ్యను పరిమితం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో దర్శనాలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.