Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 07 January 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

కవిత రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…

  • కవిత తన వద్దకు వచ్చి విజ్ఞప్తి చేయడంతో రాజీనామాను ఆమోదించినట్లు వెల్లడి
  • భావోద్వేగంతో రాజీనామా చేసినప్పుడు కొంతకాలం వేచి చూస్తామన్న ఛైర్మన్
  • రాష్ట్రంలో కొత్త పార్టీలు పెట్టాల్సిన అవసరం లేదన్న గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటం, ఆమె నూతన పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించటంపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కవిత తనను కలిసి విజ్ఞప్తి చేయడంతో రాజీనామాను ఆమోదించినట్లు తెలిపారు. భావోద్వేగంతో రాజీనామా చేసిన సందర్భాలలో కొంతకాలం వేచి చూస్తామని ఆయన అన్నారు. కవిత విషయంలోనూ అదే జరిగిందని పేర్కొన్నారు.

కవిత నూతన పార్టీ ఏర్పాటు ప్రకటనపై ఆయన స్పందిస్తూ, రాష్ట్రంలో కొత్తగా పార్టీలు పెట్టవలసిన అవసరం లేదని అన్నారు. కొత్త పార్టీ వచ్చినా మనుగడ సాగించడం కష్టమని అభిప్రాయపడ్డారు. గతంలో అనేక రాజకీయ పార్టీలు కనుమరుగయ్యాయని గుర్తు చేశారు.

ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడతారనే దానిపై స్పష్టత లేదని ఆయన అన్నారు. జనాభా ప్రాతిపదికన జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టమే వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. హిల్ట్ పాలసీ గురించి మాట్లాడుతూ, ఈ విధానం ద్వారా ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. కాలుష్యం నివారణకు పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయిం తీసుకుందని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి తప్పుబట్టారు.