Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 28 January 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

హమాస్‌తో లష్కరే భేటీ.. వీడియోలో బయటపడిన కొత్త ఉగ్ర బంధం!

  • పాకిస్థాన్ ఉగ్ర సంస్థ లష్కరే, హమాస్ మధ్య కీలక భేటీ
  • హమాస్ నేత ఖలీద్ మషల్‌తో కలిశామని ఒప్పుకున్న లష్కరే కమాండర్
  • ఖతార్‌లోని దోహాలో 2024లోనే ఈ సమావేశం జరిగినట్టు వెల్లడి
  • ఈ భేటీపై ఫైసల్ నదీమ్ మాట్లాడిన వీడియో బయటకు రావడంతో కలకలం
  • ఉగ్ర సంస్థల మధ్య పెరుగుతున్న బంధంపై నిఘా వర్గాల ఆందోళన

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, హమాస్ మధ్య కొత్త బంధం బలపడుతున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే కమాండర్ ఫైసల్ నదీమ్, హమాస్ అగ్ర నాయకుడు ఖలీద్ మషల్‌తో సమావేశమైనట్టు స్వయంగా అంగీకరించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామం అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో కొత్త ఆందోళనలకు దారితీసింది.

ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను ఫైసల్ నదీమ్ స్వయంగా ఓ వీడియోలో అంగీకరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖతార్ రాజధాని దోహాలో 2024లో ఈ భేటీ జరిగినట్టు అతడు వెల్లడించాడు. ఈ సమావేశంలో ఫైసల్ నదీమ్‌తో పాటు పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫుల్లా కసూరి కూడా పాల్గొన్నాడు. శిక్షణ, నిధుల సమీకరణ, ఉగ్రవాద ప్రచారం వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలనే వ్యూహంతోనే ఈ సమావేశం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

అమెరికా ఇప్పటికే లష్కరే తోయిబా, దాని రాజకీయ విభాగమైన పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్‌ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. అంతేకాదు, 2018లోనే ఫైసల్ నదీమ్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా గుర్తించింది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో కూడా హమాస్, లష్కరే నాయకుల మధ్య పలు సమావేశాలు జరిగాయి. తాజాగా బయటపడిన ఈ వీడియోతో రెండు సంస్థల మధ్య సమన్వయం పెరుగుతోందన్న వాదనలకు బలం చేకూరింది. ఈ పరిణామాలను భారత నిఘా వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.