Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 29 January 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ప్రేమ పెళ్లి వద్దన్నందుకు తల్లిదండ్రులను చంపిన కూతురు..

  • పెళ్లికి నిరాకరించారని కన్నవారికి విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపిన నర్సు 
  • పెద్దలు మందలించారనే మనస్తాపంతో ఒకే చీరతో ఉరివేసుకున్న ప్రేమికులు
  • వికారాబాద్ హత్య కేసులో సీన్ మార్చే ప్రయత్నం చేసినా దొరికిపోయిన నిందితురాలు
  • అచ్చంపేట, యాచారంలో వరుస ఘటనలతో స్థానికులు దిగ్భ్రాంతి

ప్రేమ అనేది ఒక మనిషిని ఉన్నతుడిని చేయాలి.. కానీ నేటి తరం యువతలో అది ప్రాణాలు తీసేంత ఉన్మాదంగా, లేదా ప్రాణాలు తీసుకునేంత బలహీనతగా మారిపోతోంది. తెలంగాణలో తాజాగా వెలుగుచూసిన రెండు వేర్వేరు ఘటనలు చూస్తుంటే కన్నప్రేమ కంటే క్షణికావేశమే పెద్దదైపోయిందా అన్న అనుమానం కలుగుతోంది. వికారాబాద్ జిల్లాలో ఒక యువతి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడి కోసం ఏకంగా కన్నవారినే కడతేర్చగా, నాగర్‌కర్నూలులో మైనర్ జంట మరణమే శరణ్యమని తనువు చాలించింది.

వికారాబాద్ జిల్లా యాచారంలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. నక్కల సురేఖ అనే యువతి నర్సింగ్ పూర్తి చేసి ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్న ఒకే ఒక్క కారణంతో వారిపై కక్ష పెంచుకుంది. తాను పని చేస్తున్న ఆసుపత్రి నుంచి అత్యవసర సమయంలో వాడే మత్తు ఇంజెక్షన్లను గుట్టుగా తెచ్చి, నడుము నొప్పి తగ్గుతుందంటూ మాయమాటలు చెప్పి కన్నతల్లిదండ్రులకు అధిక మోతాదులో ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ల ధాటికి వారు కుప్పకూలిపోగా, ఏమీ తెలియనట్లు తన అన్నకు ఫోన్ చేసి వారు స్పృహ తప్పారని నాటకమాడింది. కానీ సంఘటనా స్థలంలో దొరికిన ఖాళీ సిరంజిలు ఆమె చేసిన ఘోరాన్ని పోలీసులకు పట్టించాయి.

మరోవైపు నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో మరో విషాదం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ప్రశాంత్, సువర్ణ అనే మైనర్లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వ్యవహారం గమనించిన పెద్దలు వారిని మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఒకే చీరతో ఇద్దరూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవులుగా మారారు. మరుసటి రోజు ఉదయం తలుపులు బద్దలు కొట్టి చూడగా వారిద్దరూ విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ రెండు ఘటనలు కన్నవారికి తీరని కడుపుకోతను మిగల్చడమే కాకుండా, యువత తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలపై సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి.