Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 05 February 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా…

  • తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన అంబటి
  • అంబటి రిమాండ్ చట్టవిరుద్ధమని వాదించిన ఆయన తరఫు న్యాయవాది
  • పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం
  • హైకోర్టులో విచారణ ఈ నెల 11వ తేదీకి వాయిదా
  • గుంటూరు కోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని (క్వాష్) కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా అంబటి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, రిమాండ్ విధించడం చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం, ఈ పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు, అంబటి కస్టడీ, బెయిల్, జైలులో సౌకర్యాలకు సంబంధించిన పిటిషన్‌పై గుంటూరు కోర్టులో కూడా విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషిస్తూ బూతులతో విరుచుకుపడ్డారనే ఆరోపణలతో అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.