Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 09 February 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ఏప్రిల్‌లో కవిత కొత్త పార్టీ ప్రకటన!

  • పార్టీ గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు
  • ఏప్రిల్‌లో పార్టీని అధికారికంగా ప్రకటించనున్న కవిత
  • సామాజిక తెలంగాణే లక్ష్యమంటూ ప్రకటన
  • త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి అవకాశం

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. జాగ‌ృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. కొత్త పార్టీ ఏర్పాటు కోసం గత నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అన్ని ప్రక్రియలు సజావుగా పూర్తయితే వచ్చే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో పార్టీని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత, సొంత రాజకీయ వేదిక ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ‘జాగృతి జనంబాట’ పేరుతో ప్రజల్లోకి వెళ్తూ క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుంటున్నారు. పార్టీ విధానాల రూపకల్పన కోసం వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించేందుకు 50 కమిటీలను ఏర్పాటు చేశారు. “సామాజిక తెలంగాణ” సాధనే లక్ష్యంగా తన పార్టీ పనిచేస్తుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని కవిత ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈసీఐ నుంచి పార్టీకి సకాలంలో గుర్తింపు లభిస్తే త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలోనూ నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ వ్యూహాల రూపకల్పనలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పాత్ర కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. తనకు సెంటిమెంట్ ఎక్కువని, పార్టీ ప్రకటనకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నానని కవిత ఇటీవల వ్యాఖ్యానించడం ఈ పరిణామాలకు బలం చేకూరుస్తోంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.