Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 12 February 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి.. సభలో ఎంపీ నోటీసు…

  • అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ పై రాహుల్ ఆరోపణలు
  • నరవణె బుక్ పై మాట్లాడకుండా అడ్డుకుంటోందని ప్రభుత్వంపై విమర్శలు
  • దేశాన్ని అమ్మేశారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల ఆగ్రహం

లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్ సభలో బీజేపీ ఓ నోటీసును ఫైల్ చేసినట్లు సమాచారం. అయితే, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే.

రాహుల్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుందని, ప్రధాని మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె రాసిన బుక్ లో చైనా ఆక్రమణ విషయం స్పష్టంగా ఉందని, ఆ విషయంపై సభలో మాట్లాడకుండా అధికార పక్షం తనను అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.

ఈ ప్రసంగంపై కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సభలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రేడ్ డీల్ తో భారత్ కు ఎలాంటి నష్టం లేదని వివరించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దేశాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ నోటీసు ఇచ్చారు.