Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 17 February 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

అజిత్ పవార్ వారసురాలిగా సునేత్రా పవార్: ఎన్సీపీ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు…

  • అజిత్ పవార్ మరణానంతరం ఎన్సీపీ పగ్గాలు చేపట్టిన భార్య సునేత్ర
  • శరద్ పవార్ వర్గంతో విలీనంపై నిర్ణయాధికారం సునేత్రకే అప్పగింత
  • ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేసిన పార్టీ
  • 26న సునేత్ర నియామకాన్ని అధికారికంగా ప్రకటించనున్న పార్టీ

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో పార్టీలో ఏర్పడిన నాయకత్వ శూన్యతను భర్తీ చేసేందుకు సునేత్ర ముందుకు వచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సునేత్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం భావోద్వేగభరితంగా సాగింది. పార్టీని ఐక్యంగా ఉంచేందుకే ఈ బాధ్యత తీసుకుంటున్నట్లు చెబుతూ, ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అజిత్ పవార్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ఎమ్మెల్యేలు ఆమెకు భరోసానిచ్చారు.

శరద్ పవార్ వర్గంతో పార్టీ విలీనంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఆ విషయంపై తుది నిర్ణయం తీసుకునే పూర్తి అధికారాన్ని ఎమ్మెల్యేలు సునేత్రా పవార్‌కే కట్టబెట్టారు. అయితే, ప్రస్తుతానికి తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతామని పార్టీ సీనియర్ నేత సునీల్ తట్కరే స్పష్టం చేశారు. మరోవైపు, విలీన ప్రక్రియ ఒక ‘ముగిసిన అధ్యాయం’ అని శరద్ పవార్ వర్గం నేత శశికాంత్ షిండే వ్యాఖ్యానించడం గమనార్హం.

ఫిబ్రవరి 26న ముంబైలో జరగనున్న ఎన్సీపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సునేత్రా పవార్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించనుంది.