Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 06 March 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం!

  • బడ్జెట్ సమర్పణ సందర్భంగా ప్రకటించిన సిద్ధరామయ్య
  • పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా ఈ నిర్ణయం
  • 17వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సిద్ధరామయ్య

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు బడ్జెట్ సమర్పణ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

మొబైల్ అతి వినియోగం వల్ల కంటిచూపు సమస్యలు, ఊబకాయం, నిద్రలేమి, ఏకాగ్రతలోపం తదితర సమస్యలు వస్తున్నాయి. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నియంత్రణ అవసరమని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఇదిలా ఉండగా, కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది 17వసారి. రాష్ట్రంలో ఎక్కువసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేతగా ఆయన రికార్డు సొంతం చేసుకున్నారు. భారతదేశంలో అత్యధికసార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేతల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు.