Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 08 March 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

రూ.14 కోట్ల ఆస్తి కంచి పీఠానికి.. ఆదర్శంగా నిలిచిన ఖమ్మం ఉపాధ్యాయుడు…

  • భార్య పోషణకు ఇల్లు, రూ.20 లక్షలు కేటాయించిన కిలారు రామకోటేశ్వరరావు
  • తన గ్రామానికి పాఠశాల, ఆలయాల నిర్మాణాలకు భూములిచ్చిన దాత
  • శుక్రవారం కన్నుమూసిన ఉదారమూర్తి

ఓ సామాన్య ఉపాధ్యాయుడు తన యావదాస్తిని సమాజానికి అంకితం చేసి, అందరికీ ఆదర్శంగా నిలిచి కన్నుమూశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కిలారు రామకోటేశ్వరరావు (85), తన రూ.14 కోట్ల విలువైన ఆస్తిని దైవకార్యానికి అప్పగించి తుదిశ్వాస విడిచారు.

రామకోటేశ్వరరావు దంపతులకు సంతానం లేదు. దీంతో తన కష్టార్జితమైన 14 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు ఇళ్లు, ఒక ఫంక్షన్ హాల్‌ను తమిళనాడులోని కంచి పీఠానికి చెందేలా వారం క్రితమే రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. తన భార్య సైదమ్మ జీవనాధారం కోసం ఒక ఇల్లు, రూ.20 లక్షల నగదు కేటాయించి, మిగిలిన సంపదనంతా పీఠానికి అప్పగించారు.

రామకోటేశ్వరరావు దానకర్ణుడే కాదు, తన సొంత గ్రామ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు. గ్రామంలో పాఠశాల, గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు స్థలాలు ఇచ్చారు. అంతేకాకుండా, పలు ఆలయాలను నిర్మించి గ్రామానికి అప్పగించారు. ఎంతోమంది నిరుపేద విద్యార్థుల చదువులకు ఆయన ఆర్థికంగా అండగా నిలిచారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మరణించారు. శనివారం జరిగిన ఆయన అంత్యక్రియల్లో గ్రామస్థులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఆస్తుల కోసం ఆరాటపడే ఈ రోజుల్లో, కోట్లాది రూపాయల సంపదను లోకకల్యాణం కోసం త్యాగం చేసిన రామకోటేశ్వరరావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని గ్రామస్థులు పేర్కొన్నారు.